కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ తోనే పూర్వవైభవం..! వీ. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు..!!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అద్యక్ష పదవికి ప్రియాంక గాంధీ నేతృత్వం వహిస్తేనే పార్టీ అదికారంలోకి వస్తుందనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బాద్యతలు తన వల్ల కాదని ప్రియాంకా గాంధీ చెప్పుకొస్తున్నప్పటికి ఆమె పేరునే ప్రతిపాదిస్తున్నారు నాయకులు. కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లి, జవసత్వాలు నింపే శక్తి ప్రియాంకకే ఉన్నాయనే అభిప్రాయాలు దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ప్రియాంక గాంధీనే సరైన అభ్యర్థి అని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు అంటున్నారు.
అయితే ఎవరికి ఆ బాధ్యతలు అప్పగించాలనే దానిపై తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదేనని ఆయన పేర్కొన్నారు. గతంలో రాజీవ్ గాందీ కూడా పైలెట్ గా కొనసాగుతానని అంటే కాదని, కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని ఒప్పించామని ఆయన గుర్తు చేసారు. సోనియా, రాజీవ్ గాందీ కూతురుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రియాంక సరైన అభ్యర్థి అవుతారని అనుకుంటున్నట్టు హనుమంత రావు వివరించారు. మంగళవారం నాడు వన్ ఇండియా అడిగిన ప్రశ్నకు హనుమంతరావు సమాధానమిస్తూ ఇందిర గాందీ పోలికలతో ఉన్న ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ అద్యక్షురాలిగా పదవి ఇస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు.
రాహుల్ గాంధీ తర్వాత పార్టీ పగ్గాలను డైనమిక్ నాయకులకే అప్పగించాలని సూచించారు వీహెచ్. రాహుల్ తీసుకున్న రాజీనామా నిర్ణయం దురదృష్టకరమని, పార్టీకి నూతన ఉత్తేజాన్ని నింపగలిగే యువనేతకే అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. యంగ్ ఇండియాను దృష్టిలో ఉంచుకుని యువనేత అవసరాన్ని సీడబ్ల్యూసీ గుర్తించాలని, అట్టడుగు స్థాయి నుంచి పార్టీని ఉత్తేజపరచాలంటే దేశంలో అత్యధిక జనాభా అయిన యువశక్తి అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు.
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన ఇండియాలో ప్రజలు ఆశలు, ఆకాంక్షలను గ్రహించగలగడం యువనేతలకైతేనై సాధ్యమవుతుందన్నారు. దేశంలోని 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపే ఉండటాన్ని గుర్తించి, తదనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు ఉండాలని వీహెచ్ అన్నారు. ప్రియాంక గాంధీతో నే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తందని తెలిపారు.