హోం మంత్రి ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్.. మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
రాష్ట్రంలో అత్యాచారాలు, హత్య ఘటనలు పెట్రేగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద హంగామా సృష్టించారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు హత్యలపై నిరసనకు దిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొయినాబాద్ బాలిక అత్యాచారం ఘటన, ఖమ్మం బాలికపై అత్యాచార ఘటనలపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు .
ఖమ్మంలో దారుణం... బాలికపై అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్ పోసి ..
మినిస్టర్స్ క్వార్టర్స్ ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా మినిస్టర్స్ క్వార్టర్స్ గేటు దూకి లోపలికి చొరబడే ప్రయత్నం చేశారు. హోం మంత్రి ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారు. కార్యకర్తలతో హోంమంత్రి మెహమూద్ అలీ ఇంటిని కాంగ్రెస్ పార్టీ నేతలు ముట్టడించారు. దీంతో హోం మంత్రి మహమూద్ అలీ ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు . ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , ఏఐసిసి కార్యదర్శి సంపత్ లు కూడా పాల్గొని తమ ఆందోళన తెలియజేశారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు , బాలికలకు రక్షణ లేకుండా పోతుందని మండిపడుతున్నారు . ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచార బాధితురాలిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న భట్టి విక్రమార్క బాలిక వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఆస్తమా తో పాటుగా కాలిన గాయాలతో బాధపడుతున్న బాలికకు మెరుగైన వైద్యం అందించడం కోసం కార్పొరేట్ ఆస్పత్రికి తరలించాలని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.