కారు-కమ్యూనిస్టు దోస్తీ వెనుక మర్మమేంటీ..? సిద్ధాంతాలు ఏమయ్యాయి సీపీఐపై వీహెచ్
Recommended Video
అధికార టీఆర్ఎస్, సీపీఐ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఒంటికాలిపై లేచారు. హుజూర్నగర్ పొత్తు వెనుక మర్మం ఏంటీ అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు సీఎం కేసీఆర్ను దూషించిన సీపీఐ ఇప్పుడు భుజం భుజం కలుపుకొని ఎలా పనిచేస్తుందని నిలదీశారు. వారి పొత్తులో స్వార్థమే తప్ప, ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. నీతులు చెప్పే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని అడిగారు. టీఆర్ఎస్ పార్టీకి క్యాడర్, జనంలో మంచి పేరు ఉంటే పొత్తులు ఎందుకని వీహెచ్ అన్నారు.
యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పోరాటం.. వీహెచ్ ఛైర్మన్గా కమిటీ
సిద్ధాంతాలు, భావజాలం ఎక్కడ
కమ్యునిస్టుల సిద్దాంతాలు, భావజాలం ఏమైంది అని వీహెచ్ ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ను ఇన్నాళ్లు ఎండగట్టిన సీపీఐ, ఇప్పుడు పొత్తు ఎలా పెట్టుకుంటుందని అడిగారు. వారి సిద్దాంతాలు, భావజాలం లేవా ? చెప్పేందుకేనా నీతులు అని మండిపడ్డారు. ఐదేళ్లలో విపక్ష కాంగ్రెస్ పార్టీ కన్నా సీపీఐ ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీని దూషించిందని వీహెచ్ తెలిపారు. అప్పుడు దూషించి, ఇప్పుడు చేయి కలుపుతారా అని విమర్శించారు.
విజయం ఖాయం
హుజూర్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి విజయం ఖాయమని వీహెచ్ అన్నారు. తమ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేని వీ హెచ్ విశ్వాసం వ్యక్తం చేశారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు. ఈ విషయం కేసీఆర్కు కూడా తెలుసన్నారు. అందుకోసమే సింగిల్గా కాకుండా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెప్తారని స్పష్టంచేశారు.
రంగంలోకి పవన్..?
హుజూర్నగర్ ఉప ఎన్నికలో ప్రచారం చేయాలని జనసేన అధినేత వపన్ కల్యాణ్ను కోరతానని వీహెచ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి జనసేనాని క్యాంపెయిన్ తోడవడంతో తమ విజయవాకాశాలు మరింత మెరుగవుతాయని పేర్కొన్నారు. తెలంగాణలో జనసేనానికి ఉన్న క్రేజ్ ఉప ఎన్నికకు కలిసి వస్తోందని తెలిపారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ పార్టీ రెండో స్థానానికే పరిమితమవుతోందన్నారు. బీజేపీ, టీడీపీలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని వీహెచ్ అన్నారు.