మాజీ మంత్రి జువ్వాడి కన్నుమూత.. కేసీఆర్ సహా పలువురి సంతాపం.. అధికారిక లాంఛనాలతో..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఇకలేరు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. కరీంనగర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. జువ్వాడి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. అంత్యక్రియలను అధికార లాంచనాలతో నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం ఆదేశించారు.
పార్టీ వెటరన్ మృతితో కాంగ్రెస్ వర్గాల్లో విషాదం నెలకొంది. జువ్వాడి మరణంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నివాళులు అర్పించి, సంతాపం ప్రకటించింది. జువ్వాడి స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామం. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆయన.. కొంతకాలం జైలు జీవితం కూడా గడిపారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి, పన్నెండేళ్ల పాటు గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. బుగ్గారం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007 లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి కేబినెట్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
రాజకీయాల్లో విలక్షణ నేతగా పేరుపొందిన జువ్వాడి రత్నాకర్ రావు.. తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్గా పనిచేసి 1981 లో జగిత్యాల సమితి అధ్యక్షులుగా గెలుపొందారు. ఆ తర్వాత 1983 లో కాంగ్రెస్ తరపున జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1989 లో జరిగిన ఎన్నికల్లో బుగ్గారం నుంచి ఇండిపెండెంట్ గా గెలుపొందారు. 2007లో మంత్రి పదవి చేపట్టిన ఆయన, మళ్లీ 2009లో ఓటమిపాలయ్యారు. వయసుపైబడటంతో అనారోగ్యానికి గురైన ఆయన, కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్ తోపాటు అన్ని పార్టీలకు చెందిన నేతలు జువ్వాడి మృతికి సంతాపాలు ప్రకటించారు.