టికెట్ వస్తుందని ఖర్చు.. కాంగ్రెస్ హ్యాండిచ్చేసరికి నిప్పు.. 15 లక్షలు గోవిందా..! (వీడియో)
హైదరాబాద్ : చట్టసభల్లో అధ్యక్షా అని అనాలనుకున్నాడు. ప్రజాప్రతినిధిగా ఓ మెట్టు ఎదుగుదామని కలలు కన్నాడు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నాడు. తీరా టికెట్ రాక.. పార్టీ పెద్దల బుజ్జగింపులతో సర్దిచెప్పుకున్నాడు. పార్లమెంటరీ స్థానం నీదేనన్న హైకమాండ్ మాటలు ఎంతగానో నమ్మాడు. చివరకు అవి కాని పోనీ ముచ్చట్లని తెలుసుకున్నాడు. పార్టీ చీఫ్ మీద కోపంతో ఏకంగా 15 లక్షల రూపాయల ప్రచార సామాగ్రి తగులబెట్టాడు. కంటోన్మెంట్ కాంగ్రెస్ లీడర్ క్రిశాంక్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
పీక్ స్టేజీకి ఇంటర్నల్ వార్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం క్రమక్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబొర్లా పడ్డ కాంగ్రెస్ పార్టీకి రానురాను పరిణామాలు మరింత క్లిష్టతరంగా మారుతున్నాయి. హస్తం గుర్తుపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కేస్తున్నారు. ఈ క్రమంలో కంటోన్మెంట్ యంగ్ లీడర్ క్రిశాంక్ వ్యవహారం ఆ పార్టీని మరింత ఇరుకున పెడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ ఆశించి భంగపడ్డాడు క్రిశాంక్.
అయితే లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తామన్న హస్తం గూటి పెద్దలు ఈసారి కూడా మొండిచేయి చూపించారట. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీసీసీ అధికార ప్రతినిధి పదవితో పాటు ప్రధాన కార్యదర్శి పోస్టుకు గుడ్ బై చెప్పేశాడు. అయితే రాజీనామా చేస్తున్నాడనే విషయం తెలిసి కూడా ఏ ఒక్కరూ ఆయన్ని సంప్రదించకపోవడం మరింత ఆజ్యం పోసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శశాంక్.. పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్న 15 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని తగులబెట్టాడు.
అంతా మీవల్లే..!
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైరయ్యాడు క్రిశాంక్. ఉత్తమ్ తనను మోసం చేశారని ఆరోపించాడు. అసెంబ్లీ టికెట్ ఇస్తామన్నారు.. అది ఇవ్వలేదు. ఇప్పుడేమో లోక్సభ టికెట్ ఇస్తామన్నారు.. అదీ లేదు. ఇలా ఆశ చూపిస్తూ ఎన్నిసార్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలమున్నా.. అవకాశాలు రావు, పైగా అవమానాలు తప్పవంటూ నిట్టూర్చారు. అందుకే పార్టీ వీడి వెళ్లిపోతున్నా.. మీరు చేసిన అన్యాయాలకు విసుగు చెంది 15 లక్షల విలువచేసే ప్రచార సామాగ్రి తగులబెడుతున్నానంటూ వీడియో రిలీజ్ చేశారు. మీరు భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ రానంటూ ఘాటుగా విమర్శించారు.
అప్పుడు లేదు.. ఇప్పుడు లేదు.. ఇంకెప్పుడు?
తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి కంటోన్మెంట్ టికెట్ ఆశించాడు క్రిశాంక్. అయితే అప్పుడున్న పరిస్థితుల కారణంగా ఆయన సొంత మామ సర్వే సత్యనారాయణకు ఆ స్థానం కేటాయించారు. అప్పుడు కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నట్లుగా క్రిశాంక్ ప్రచారం చేసుకున్నాడు. తీరా టికెట్ రాలేదు. అయితే లోక్సభ ఎన్నికల్లో న్యాయం చేస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారట. కానీ ఈసారి కూడా మొండిచేయి చూపిస్తున్నారనే కోపంతో ఎలక్షన్ల కోసం సిద్ధం చేసుకున్న ప్రచార సామాగ్రికి నిప్పు పెట్టాడు క్రిశాంక్. మహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో క్రిశాంక్ లాంటి బాధితులు మరెంతమంది ఉన్నారోననే గుసగుసలు జోరందుకోవడం గమనార్హం.