తెలంగాణలో కరోనా కల్లోలం.. 3557 కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,557 కేసులు వచ్చాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1474 కేసులు నమోదయ్యాయి. 1,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన ముగ్గురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,18,196కి చేరుకున్నాయి. వీరిలో 6,89,878 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,065 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,253 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 96.06 శాతంగా ఉంది. ఇదీ కాస్త రిలీఫ్ కలిగిస్తోంది. నిన్న 2983 కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ 500 పై చిలుకు కేసులు పెరిగాయి. ఏపీలో అయితే 10 వేల మార్క్ చేరింది.
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలంటూ తెలంగాణ సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలంటూ తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అలాగే సోషల్ డిస్టెన్స్, మాస్కుల నిబంధనలను రాష్ట్రంలో కచ్చితంగా అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు సూచించింది.
కరోనా నియంత్రణపై కేబినెట్ చర్చిస్తున్నట్లు ఏజీ వెల్లడించగా... పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ కేసులపై విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది హైకోర్టు. ఇటు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన స్వల్ప లక్షణాలు రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.