తెలంగాణలో మరో కరోనా మరణం: 2కు చేరిక, 77 పాజిటివ్ కేసుల్లో 15 మంది డిశ్చార్జ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ బారిన పడి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య రెండుకు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం ఒక్క రోజే ఆరు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వెల్లడించింది.
77 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిసంఖ్య 77కు చేరింది. కాగా, కరోనా నుంచి కోలుకుని మొత్తం 15 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 61గా ఉంది. కాగా, కరీంనగర్లో తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ శశాంక వెల్లడించారు. ఇటీవల ఇండోనేషియాకు చెందిన కొంతమంది కరీంనగర్కు వచ్చిన విషయం తెలిసిందే. వారందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారితో తిరిగిన వ్యక్తికి కూడా గతంలో పాజిటివ్ వచ్చింది.
ముగ్గురు పిల్లలతోపాటు ఆ 8 మంది గాంధీ ఆస్పత్రికి...
ఇప్పుడు ఆ వ్యక్తి సోదరి, తల్లికి కూడా కరోనా సోకినట్లు కలెక్టర్ తెలిపారు. ఇక ఆ ముగ్గురిని కలిసిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. పాజిటివ్ వ్యక్తితోపాటు ఆ ఇంట్లో 8 మంది ఉంటారని, వారిలో ఇద్దరికే పాజిటివ్ వచ్చిందని చెప్పారు. మొత్తం ఆ మందిని కూడా గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు, ఆ కుటుంబంలోని ముగ్గురు పిల్లలు కూడా ఆస్పత్రిలోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇండియా రైస్ బౌల్ తెలంగాణ అంటూ కేసీఆర్
ఇది ఇలా ఉండగా, కరోనా నేపథ్యంలో రైతుల పంటల కొనుగోలు కోసం రాష్ట్రంలోని రైస్ మిల్లర్లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రైతుల పంటలను కొనుగోలు చేసే మిల్లర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చిస్తామని, అసెంబ్లీలో కూడా చర్చించి ఆమోదిస్తామని సీఎం తెలిపారు. ప్రపంచమంతా కరువు వచ్చినా.. తెలంగాణలో కరువు రాదని.. ఎందుకంటే తెలంగాణలో భారీగా పంటలు పండాయని అన్నారు. యాసంగిలో కూడా పంటలు అదేస్థాయిలో పండుతాయన్నారు. ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకుపైగా ఎకరాల్లో వరి పంట పండుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతోందన్నారు. రైస్ మిల్లర్లకు అధికారుల నుంచి వేధింపులు ఉండబోవని, వారికి సరైన మార్కెటింగ్ వ్యూహం ఉండాలన్నారు. రైస్ మిల్లులను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుగా గుర్తించి, వాటికి అవసరమైన రాయితీలు, ప్రోత్సహకాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో గోదాముల సంఖ్యను పెంచాలన్నారు. ఇందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. మిల్లులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైల్వే సైడింగ్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.