corona effect: తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు వాయిదా, హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అయితే, శనివారం జరగాల్సిన పరీక్షలను యథావిధిగా నిర్వహించాలని స్పష్టం చేసింది.
14 మంది విదేశీయుల గుర్తింపు: కరోనా పరీక్ష కోసం గాంధీ ఆస్పత్రికి తరలింపు
మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
బాలకృష్ణ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యం విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల సందర్భంగా విద్యార్థులు గుమిగూడే అవకాశం ఉందని, కరోనా తీవ్ర ప్రభావం ఉన్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తేనే మంచిదని బాలకృష్ణ కోర్టును కోరడంతో న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.
కాగా, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులకు మార్చి 31 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, 10 తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని సిద్ధమైంది.. అయితే, తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు నిలిచిపోనున్నాయి. ఇతర పరీక్షలు కూడా మార్చి తర్వాతే నిర్వహించే అవకాశం ఉంది.
ఇది ఇలావుండగా, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వివిధ ఆస్పత్రుల్లో 47 మంది అనుమానితులు చికిత్స తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా సోకుతుండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.