కరోనా ఎఫెక్ట్ .. సమ్మక్క ,సారలమ్మల దర్శనానికి రాకండి .. గిరిజనుల విజ్ఞప్తి
తెలంగాణా కుంభమేళా మేడారం సమ్మక్క , సారలమ్మల జాతర. రెండేళ్లకోసారి ఈ జాతర జరిగినా , నిత్యం అమ్మవార్లను దర్శించుకోవటానికి భక్తులు వెళ్తూ ఉంటారు. వివిధ రాష్ట్రాల నుండి తండోపతండాలుగా మేడారం సమ్మక్క , సారలమ్మల దర్శనానికి వచ్చే భక్తుల విషయంలో మేడారం ప్రాంత గిరిజనులు, సమ్మక్క సారలమ్మల పూజారులు నిర్ణయం తీసుకున్నారు. మేడారం వచ్చే భక్తులకు రావద్దని సూచిస్తున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న వారు సమ్మక్క ,సారలమ్మల గద్దెల ప్రాంగణాలకు తాళాలు వేశారు.
ఇక అంతే కాదు ఆలయ ప్రాంగణంలో నిర్వహించే బెల్లం షాపులు, పూజా సామానుల షాపులు సైతం మూసివేశారు. సమ్మక్క , సారలమ్మలను దర్శించుకోవటానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చే క్రమంలో వారికి ఒకవేళ ఎవరికైనా కరోనా వైరస్ సోకి ఉంటే అది ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర నుండి ఎక్కువ మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవటానికి వస్తారు.
Recommended Video
ఇప్పటికే మహారాష్ట్రలో 49కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. ఈ నేపధ్యంలో ఆ రాష్ట్రం నుండి భక్తులు వస్తే స్థానికులు భయపడుతున్న పరిస్థితి వచ్చింది. ఇక అక్కడ స్క్రీనింగ్ లు నిర్వహించటానికి అవకాశం లేని కారణంగా మేడారం కు భక్తులను రావద్దని సూచిస్తున్నారు. ఇక అందరూ సహకరించాలని కోరుతున్నారు. ఇక నేటి నుండి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్నింటినీ మూసి వేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడిస్తున్నారు.