కరోనా ఎఫెక్ట్ .. చికెన్ బిర్యానీ నో అంటున్న ప్రజలు ... బిజినెస్ లేక ఉసూరంటున్న రెస్టారెంట్లు
కరోనా వైరస్ చికెన్ , మటన్ మార్కెట్లను మాత్రమే కాదు హోటళ్ళు, రెస్టారెంట్ లపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. జంతు మాంసం తింటే కరోనా వైరస్ వస్తుందని ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుండటంతో చికెన్ , మటన్ తినాలంటేనే భయపడుతున్నారు ప్రజలు . ముఖ్యంగా కోళ్ళు తింటే కరోనా వస్తుందని చికెన్ కు నో చెప్తున్నారు. దీంతో హైదరాబాద్ లో చికెన్ బిర్యానీ గిరాకీ బాగా తగ్గిపోయింది.
కోవిడ్ 19 ఎఫెక్ట్ ... కరోనా నుండి కాపాడమని చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు
చికెన్ బిర్యానీ అంటేనే భయపడుతున్న హైదరాబాదీలు
హైదరాబాద్ చికెన్ బిర్యానీకి ఫేమస్ . ఇక అక్కడ హోటల్స్ ఎప్పుడూ బిర్యానీ ప్రియులతో రద్దీగా ఉండేవి. కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు హైదరాబాదీలు . దీంతో హోటళ్లు, రెస్టారెంట్ లలో బిజినెస్ బాగా తగ్గింది. చికెన్ తినే నాధుడే లేని పరిస్థితి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు తగ్గినా హైదరాబాద్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసు ఒకటి నమోదయ్యే వరకు చికెన్ బిర్యానీ అమ్మకాలు జోరుగానే సాగాయి.
కరోనా వైరస్ కేసు ఎఫెక్ట్ .. బాగా తగ్గిన చికెన్ బిర్యానీ అమ్మకాలు
ఇక ఎప్పుడైతే హైదరాబాద్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు అయిందని మంత్రి ప్రకటించారో ఒక్కసారిగా చికెన్ గిరాకీ తగ్గిపోయింది. రెండు రోజులుగా బిజినెస్ 50 శాతం తగ్గిందని హోటల్, రెస్టారెంట్ ల నిర్వాహకులు చెప్తున్నారు. ఫుడ్ ఆర్డర్లపైన కూడా ఈ ఎఫెక్ట్ ఉన్నదని చెప్తున్నారు. ఒకప్పుడు చికెన్ బిర్యానీ అంటే లొట్టలేసి లాగించిన బిర్యానీ ప్రియులు ఇప్పడు కరోనా దెబ్బకు బిర్యానీ అంటేనే మాకొద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారు. ఇక మాస్కులు ధరించి భయం గుప్పిట్లో ఉంటున్నారు.
చికెన్ బిర్యానీకి నో .. రెస్టారెంట్లు వెలవెల
తాజా పరిస్థితుల నేపధ్యంలో చికెన్ కు చాలా దూరం ఉంటున్న ప్రజలను చూసి ఇక హోటళ్ళు, రెస్టారెంట్ లలో సైతం చికెన్ వంటకాలు తగ్గిస్తున్నారు. దీంతో పౌల్ట్రీ మొత్తానికే దెబ్బ తినే పరిస్థితి ఉందని కోళ్ళ ఫారాలు నిర్వహిస్తున్న వారు లబోదిబో అంటున్నారు. ఈ పరిస్థితి నుండి తమను ప్రభుత్వమే కాపాడాలని కోరుతున్నారు. చికెన్ తినాలని , చికెన్ తింటే కరోనా రాదు అని సాక్షాత్తు కేటీఆర్ చెప్పినప్పటికీ ఎప్పుడైతే తెలంగాణలో కరోనా వైరస్ ఎంటర్ అయ్యిందో అప్పుడే జనం చికెన్ కి , చికెన్ బిర్యానీకి నో చెప్పారు . దీంతో హైదరాబాదీ బిర్యానీ కొనుగోళ్ళు లేక రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి.