31 మంది వైద్యులకు కరోనా.!తెలంగాణలో ఉలిక్కిపడ్డ యంత్రాంగం.!
హైదరాబాద్ : కరోనా వైరస్ క్టిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్లు చివరికి వారి ప్రాణాలనే ప్రమాదకర పరిస్ధితుల్లోకి నెట్టేసుకుంటున్నారు. కరోనా వైరస్ సోకిన రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు కూడా కరోనా వైరస్ బారిన పడిపోతున్నారు. వైద్య వృత్తికి న్యాయం చేయాలనే కృతనిశ్చయంతో కొంత మంది వైద్యులు రోగులకు అందిస్తున్నసేవలు వారికే శరాగాతంగా పరిణమిస్తున్నాయి. తెలంగాణలో ఏకంగా 31మంది వైద్యులకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఇదే అంశంపై అత్యవసర సమావేశానికి శ్రీకారం చుట్టారు అధికారులు.
కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న యంత్రాంగం.. ముందు వరసలో నిలిచిన వైద్యులు..
కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వ్యాధి గ్రస్తులను అంతే పోరటం చేసి రక్షించాలనే ఆరాటం మన వైద్యుల్లో కనిపిస్తోంది. ఆ ఆరాటమే డాక్టర్ల పట్ల మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం, దాని తీవ్రతపై పూర్తి అవగాహన ఉన్న డాక్టర్లు, తమ ప్రాణాలను పణంగా పెట్టి, వైరస్ సోకిన వారిని రక్షించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్న డాక్టర్లకు కూడా వైరస్ సోకుతోంది. ఆ విధంగా తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న 31 మంది డాక్టర్లకు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్స్ కు వైరస్ సోకడంతో, అధికారులు పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
ప్రాణాలకు తెగించి ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు.. ప్రాణాల మీదకు తెచ్చకుంటున్న డాక్టర్లు..
తెలంగాణలో సుమారు 31మంది వైద్యులకు కరోనా వైరస్ సోకిందని గురువారం నాడు నిర్ధారణ కావడంతో, రాష్ట్ర వైద్య వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులే వైరస్ కు హాట్ స్పాట్స్ గా మారుతున్నాయన్న ఆందోళన పెరిగిపోతున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ, ఈ సమావేశం నిర్వహించి, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. కరోనా బారిన పడ్డ వారికి వైద్యం అందిస్తున్న డాక్టర్లకే కరోనా సోకుతుండడంతో ఇక ఎవరు వైరస్ బారిన పడ్డ వాళ్లకు వైద్యం అందిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లకు పాజిటివ్.. అత్యవసర సమావేశమైన అధికారులు..
ఇదిలా ఉండగా తాజాగా వైరస్ బారిన పడ్డ డాక్టర్లు గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నిమ్స్, పెట్లబుర్జ్ ఆసుపత్రికి చెందిన వారని అధికారులు దృవీకరిస్తున్నారు. నిమ్స్ కార్డియాలజీ విభాగంలోని నలుగురు పీజీ రెసిడెంట్స్, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్స్, పెట్లబుర్జు ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగానికి చెందిన ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు, ఓ ప్రొఫెసర్ కు వైరస్ సోకింది. ఉస్మానియాలో అనస్థీషియా విభాగంలో పని చేస్తున్న పీజీ డాక్టర్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ఇద్దరు పీజీ రెసిడెంట్స్, నలుగురు హౌస్ సర్జన్లకు వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇదే అంశం పట్ల సహచర వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
తక్షణ చర్యలపై అధికారుల సమవేశం.. వైద్య రంగాన్ని కాపాడే దిశగా చర్యలు..
ఈ సంఘటన వెలుగులోకి రావడంతో తీవ్ర ఆందోళనకు గురైన హెల్త్ వర్కర్లు, జూనియర్ డాక్టర్ల బృందం తెలంగాణ వైద్య మంత్రి ఈటల రాజేందర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లను కలిసి, తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పీజీ తుది సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని, హెల్త్ కేర్ వర్కర్లందరికి తరచూ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ వచ్చిన వారిని విధుల నుంచి తప్పించి, క్వారంటైన్ లో ఉంచి వైద్య చికిత్సలు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవే పరిస్థితులపైన ప్రభుత్వ యంత్రాంగం లోతైన విశ్లేషణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులు వైద్యరంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశంపై అధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.