ఉలిక్కిపడ్డ కూకట్ పల్లి..! 5 కరోనా పాజిటీవ్ కేసుల నమోదు..!అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం..!
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతున్నట్టే తెలంగాణలో కూడా విజృంభిస్తోంది. ఓ రెండు వారాలు కాస్త శాంతించినట్టు కనిపించిన కరోనా మహమ్మారి తెలంగాణలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. బుదవారం ఒక్కరోజే ఏకంగా 38 కొత్త కేసులు నమోదు కావడంతోపాటు, ఈ ఒక్కరోజులోనే ఐదుగురు చనిపోయారు. బుదవారం ఒక్కరోజే ఐదుగురు మృత్యువాత పడడం తెలంగాణలో ఇదే తొలిసారి కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కిపడుతోంది. ఈ సంఘటన ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణ కరోనా ప్రమాదఘంటికలు.. కూకట్ పల్లిలో 5 పాజిటీవ్ కేసుల నమోదు..
వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 45కి పెరిగింది. రోజూ కేవలం గ్రేటర్ పరిధిలోనే నమోదవుతున్న కేసులు తాజాగా రంగారెడ్డి జిల్లాలో రెండు నమోదు కావడం కలవరపాటుకు గురిచేస్తోంది. భవన నిర్మాణ కూలీల్లో 10 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకింది. ఈరోజు 23 మంది డిశ్చార్జి కావడంతో పాటు, రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,036కి చేరుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 618 మంది ఆసుపత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా నగరం ఉలిక్కి పడే విధంగా కేసలు ఈ రోజు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం యంత్రాంగం మొత్తం రద్దీగా ఉండే ఆ ప్రాతంపై దృష్టి కేంద్రీకరించింది.
ఉలిక్కిపడ్డ హైదరాబాద్ నగరం.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం..
హైదరాబాద్ మహా నగరంలో కూకట్ పల్లికి ఓ ప్రత్యేకత ఉంది. వివిధ కారణాలతో నగరానికి చేరుకునే వారందరూ కూకట్ పల్లిలో ఆశ్రయం పొందుతుంటారు. అందుకే కూకట్ పల్లిని సకల సంస్కృతుల సమాహారంగా అభివర్ణిస్తుంటారు. ఇలాంటి ప్రదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత రద్దీ ప్రదేశాలలో ఒకటైన కుకట్ పల్లిలో బుదవారం ఒక్కరోజే ఐదు కేసులు నమోదు కావడం విస్మయాన్ని కలిగిస్తోంది. వ్యాపారాలు, విద్యా సంస్థలకు కేంద్రంగా ఉన్న కూకట్ పల్లిలో కరోనా కేసులు నిర్దారణ కావడం పట్ల ఐటీ వర్గాన్ని ఆందోళనలో ముంచుతోంది. పైగా అనేక ఎన్నారై కుటుంబాల తల్లిదండ్రులు కూడా ఇక్కడ నివసిస్తుంటారు.
అత్యంత రద్దీగా ఉండే కూకట్ పల్లి.. ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు..
అందుకే కూకట్ పల్లి కేసులు ఎన్నారైల్లో కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఖరీదైన రెయిన్బో విస్టా అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఒక వైద్యుడు, అతడి తండ్రికి కూడా కరోనా వైరస్ సోకింది. ఈ వైద్యుడు అపోలో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో అప్రమత్తమైన అధికారులు రెయిన్బో విస్టా అపార్టుమెంటులలో పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు. ఎవరెవరు ఎక్కడినుండి చురుకున్నారో, ఏఏ వృత్తుల్లో ఉన్నారు, కొత్తగా వచ్చిన వారి ట్రావెల్ రిపోర్టును అధికారులు పరీక్షిస్తున్నారు. మరో మూడు కేసుల్లో అల్లాపూర్ నుండి ఒకటి, బుబ్బగుడ లో ఒకటిగా నిర్దారించారు. ఇవి కూడా కూకట్ పట్ల ప్రాంతానికి చెందినవే కావడం ఆందోళన కలిగిస్తోంది.
Recommended Video
కరోనా పరీక్షలు నిర్వహించడంలో తెలంగాణ ఫెయిల్.. మండిపడ్డ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి..
అంతే కాకుండా అద్భుతంగా కరోనాను అదుపు చేస్తున్నామని చెప్పుకొస్తున్న తెలంగాణన్ని కేంద్ర ప్రభుత్వం మందలించినట్టు తెలుస్తోంది. పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన అసంతృప్తిని వ్యక్తం చేసిందని స్పష్టమవుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా నిర్వహించిన 14 లక్షలకు పైగా ఆర్టీ-పిసిఆర్ (రియల్ టైమ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్) పరీక్షలలో తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన పరీక్షల సంఖ్య 20,754 మాత్రమేనని కేంద్రం నిర్ధారిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ కంటే చాలా తక్కువ నమూనాలను రాష్ట్రం పరీక్షించిందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.