తెలంగాణా పోలీస్ శాఖను పట్టిపీడిస్తున్న కరోనా ... ఇప్పటివరకు 4259 మందికి పాజిటివ్
తెలంగాణా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తుంది. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కరోనా పోరాటంలో ముందు వరుసలో ఉన్న పోలీసు శాఖను కరోనా పట్టి పీడిస్తుంది.
అమెరికా ముందు జాగ్రత్త: 330 మిలియన్ల జనాభాకు 800 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ల ఆర్డర్లు
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 88,396 కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 23,438కాగా, కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 64,284గా ఉంది. కరోనా వైరస్ ను నియంత్రించడానికి ప్రభుత్వం ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ పోలీస్ శాఖలోనూ కరోనా టెన్షన్ క్రియేట్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4259 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు .
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ మంది పోలీసులు కరోనా బారిన పడినట్లుగా తెలుస్తుంది.మొత్తం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1946 మంది పోలీసులకు కరోనా సోకినట్టు సమాచారం. వీరిలో 26 మంది మృతి చెందినట్లుగా పోలీసువర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా 39 మంది పోలీసులు మృతి చెందారు.హైదరాబాద్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, నల్గొండ జిల్లాలలో పోలీసులు ఎక్కువగా కరోనా బారిన పడ్డారని, చాలా మంది పోలీసులు తిరిగి కోలుకున్నారని తెలుస్తుంది.
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఫ్రంట్లైన్ వారియర్స్ గా బృహత్తరమైన సేవలందించారు . నేటికీ ప్రజల్లో కరోనా పట్ల అవగాహన తీసుకురావడానికి ఎంతగానో పనిచేస్తున్నారు. పోలీస్ శాఖలో కరోనా ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ, పోలీసులు కరోనా సమయంలో కుటుంబాలను వదిలిపెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల సేవలను అభినందిస్తున్నారు అన్నివర్గాల ప్రజలు. కరోనా నుండి కోలుకున్న పోలీసులకు తిరిగి సాదరంగా విధుల్లోకి స్వాగతం పలుకుతున్నారు.