చికెన్ తింటే కరోనా వైరస్ సోకుతుందా? సీఎం కేసీఆర్తోపాటు ఇంట్లో అందరం అదే తింటున్నాం: కేటీఆర్
కొత్తగా పుట్టుకొచ్చిన కొవిడ్'19(కరోనా వైరస్) మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వణికిస్తున్నమాట నిజమే. అయితే ఇండియా మాత్రం దాదాపు ఆ వ్యాధిని జయించింది. వైరస్ బారినపడి ఆస్పత్రల్లో చికిత్స పొందినవారంతా డిశ్చార్జి అయి హ్యాపీగా ఇళ్లకు వెళ్లిపోయారు. అయినా కూడా కరోనాపై విపరీతమైన పుకార్లు పుట్టుకొచ్చాయి. చికెన్ తింటే వైరస్ సోకుతుందని తప్పుడు ప్రచారం జరగడంతో.. లక్షల మంది ఉపాధి పొందుతోన్న పౌల్ట్రీ పరిశ్రమ కుదుపునకు గురైంది. నిజానికి చెకెన్ తినడం ద్వారా కరోనా వైరస్ రానేరాదు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో చికెన్ తింటూమరీ వివరించారు.
కరోనా వదంతుల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్(నెక్), తెలంగాణ పౌల్ట్రీ రైతులు సంయుక్తంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో శుక్రవారం 'చికెన్ అండ్ ఎగ్ మేళా' నిర్వహించారు. ఈ క్యాక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చికెన్ ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందన్నది తప్పుడు ప్రచారమని, అసలా రెండింటికి సంబంధమే లేదని మంత్రి చెప్పారు. ''మా ఇంట్లో సీఎం కేసీఆర్ తోపాటు అందరం చికెన్ తింటున్నాం. మీరు కూడా లాంటి భయాలు లేకుండా తినేయండి''అని భరోసా ఇచ్చారు.
పౌల్ట్రీ రంగంలో మిగతా రాష్ట్రాలకంటే ముందున్న తెలంగాణ 'పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా'గా కొనసాగుతున్నదని, ఇక్కడి మొక్కజొన్న రైతులకు కూడా పౌల్ట్రీ రంగం అండగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తక్కువ ధరలోలో లభించే ఎక్కువ పోషకాలున్న ఆహారం చికెన్ అని, దాన్ని తినడం వల్ల ఎవరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాబోవని అన్నారు. నిజానికి మనం ఎగ్, చికెన్, మటన్, ఫిష్ వండుకునే విధానంలో కరోనా లాంటి వైరస్లు బతకనేలేవని తెలిపారు.
చికెన్, ఎగ్ మేళాలో ఎగ్ కో-ఆర్డినేషన్(నెక్), తెలంగాణ పౌల్ట్రీ రైతులు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డితోపాటు నటి రష్మిక కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ అందరితో కలిసి సరదాగా చికెన్ పీసులు లాగించారు. ఈ సందర్భంగా సందర్శకులకు వండిన చికెన్, ఎగ్ ను ఉచితంగా పంచిపెట్టారు.