తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్: కిలో చికెన్ రూ.25కే
ఇండియాలో కరోనావైరస్ ధాటికి ఇప్పటిదాకా ప్రాణనష్టం లేనప్పటికీ.. పౌల్ట్రీరంగం మాత్రం దాదాపు కుదేలయ్యే పరిస్థితికి వచ్చింది. చికెన్ తింటే కరోనా వ్యాపిస్తుందంటూ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఉధృతంగా ప్రచారం జరగడంతో జనం చికెన్, గుడ్లు తినడం తగ్గించారు. పెద్ద కంపెనీల సంగతి పక్కనపెడితే ధరలు అమాంతం తగ్గిపోవడం చిన్న, మధ్యతరహా పౌల్ట్రీ రైతులకు శాపంగా మారింది. చికెన్ తింటే కరోనా రాదని చెప్పడానికి మంత్రులతో 'చికెన్, ఎగ్ మేళా' నిర్వహించినప్పటికీ సత్ఫలితాలు రాలేదు. దీంతో..
ఉన్న సరుకును ఊరికే పోగొట్టుకునేకంటే, పెట్టుబడి మిగుల్చుకునేలా పౌల్ట్రీ రైతులు, చికెన్ షాపుల యజమానులు వినూత్న పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. నిన్నఆదివారం కొన్ని జిల్లాల్లోని దుకాణాల్లో రూ.70కే కేజీ చికెన్ అమ్మగా, మరికొన్ని చోట్ల కిలో చికెన్ కు 4 గుడ్లు ఉచితంగా ఇచ్చారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఓ చికెన్ షాపు యజమాని క్రేజీ ఐడియాతో కోళ్లను అమ్మేసేప్రయత్నం చేశాడు.
చౌటుప్పల్ కు చెందిన ఆ చికెన్ షాపు యజమాని.. నాలుగు కేజీల బరువున్న రెండు కోళ్లను రూ.100కే విక్రయిస్తున్నట్లు బోర్డు పెట్టాడు. అంటే కిలో చికెన్ రూ.25కే వస్తుందన్నమాట. ఆనోటా ఈనోటా ఈ ఆఫర్ గురించి ఊరంగా ప్రచారం కావడంతో సదరు చికెన్ షాపునకు జనం పోటెత్తారు. పూర్తిగా నష్టపోయే కంటే లాభాన్ని వదులుకోడానికి సిద్ధపడే ఈ ఆఫర్ పెట్టినట్లు చెప్పాడా యజమాని. అయితే అంతకుముందు చికెన్ తింటే కరోనా వస్తుందని నమ్మిన జనం.. తక్కువ ధరకే దొరుకుతుందనడంతో చికెన్ షాపు ముందు క్యూలు కట్టడం విశేషం.