coronavirus: అందుబాటులోకి గచ్చిబౌలి క్వారంటైన్ సెంటర్..?, 1500 మందికి చికిత్స: మంత్రి ఈటల..
కరోనా వైరస్ను అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. వైరస్ గురించి సోషల్ మీడియాలో గానీ, టీవీలో గానీ తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించింది. గచ్చిబౌలిలో 1500 మందిని క్వారంటైన్ చేసే ఏర్పాట్లను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆరురోజుల్లో సెంటర్ అందుబాటులోకి వస్తుందని వివరించారు.
కరోనా వైరస్ గురించి మీడియా తప్పుడు సమాచారం ఇవ్వొద్దని ఈటల రాజేందర్ సూచించారు. హైదరాబాద్లో పరిస్థితి అదుపులో ఉందని.. ఎలాంటి రెడ్ జోన్లు జారీచేయలేదని పేర్కొన్నారు. కరీంనగర్లో మాత్రం ఇండోనేషియా నుంచి వచ్చిన బృందం పర్యటించిన 3 కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్ ఏర్పాటు చేశామని వివరించారు. ఆ పరిధిలో ఉన్న కుటుంబాలకు వైద్య పరీక్షలు చేస్తున్నామని వివరించారు. వైరస్ గురించి సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. తప్పుడు కథనాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారే కుటుంబసభ్యులకు వైరస్ అంటించారని పేర్కొన్నారు.
కరోనా వైరస్ గాలిలో సోకి వ్యాధి కాదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. అంటు వ్యాధి అని, ముట్టుకున్నా, లేదంటే తుమ్మిన తుంపిర్ల ద్వారా మాత్రమే సోకుతుందని తెలిపారు. రాష్ట్రంలో వైరస్ సోకిన ఒక్కరి పరిస్థితి కూడా విషమంగా లేదని చెప్పారు. వైరస్ సోకిన అందరూ కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి పెరగడంతో సీఎం కేసీఆర్ నిత్యం ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.