హైదరాబాద్లో దారుణం.. ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా పేషెంట్ మృతి...
కరోనా పట్ల అనవసర ఆందోళన,అపోహలు ఇంకా జనాలను వెంటాడుతున్నాయి. తాజాగా హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో... ఓ కరోనా పేషెంట్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని ఎయిర్ఫోర్స్లో పనిచేసే నాగేంద్రగా గుర్తించారు. కరోనా సోకడంతో తీవ్ర మనస్తాపం చెందిన అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఎయిర్ఫోర్స్లో విధులు నిర్వహిస్తున్న నాగేంద్రకు కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో శ్రీనగర్ కాలనీలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఏమైందో తెలియదు గానీ గురువారం(జూలై 23) ఆస్పత్రి బిల్డింగ్ పైకి చేరుకున్న నాగేంద్ర... అక్కడినుంచి కిందకు దూకేశాడు. దీంతో తలకు తీవ్ర గాయాలవగా... అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందించడంతో... సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
బుధవారం(జూలై 22) మహబూబాబాద్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మోతే జనార్ధన్ రెడ్డి(52)కి కరోనా పాజిటివ్గా నిర్దారణ కావడంతో... హోమ్ క్వారెంటైన్లో ఉండాలని స్థానిక అధికారులు సూచించారు. అయితే జనార్దన్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Recommended Video
తెలంగాణలో బుధవారం (జూలై 22) ఒక్కరోజే కొత్తగా 1,554 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరుకుంది. కరోనాతో బుధవారం తొమ్మిది మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 438కి చేరింది. ఇప్పటివరకూ 37,666 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,155 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.