కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు ఢిల్లీ మోడల్ను అమలు చేయాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాదు: కరోనావైరస్ను నియంత్రించేందుకు లేదా కట్టడి చేసేందుకు ఢిల్లీ తరహా మోడల్ను అమలు చేయాలని కోరారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. శనివారం మంత్రి కిషన్ రెడ్డి గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు రీసెర్చ్ (టిమ్స్)ను సందర్శించారు. అక్కడ పరిస్థితులను సమీక్షించారు. తెలంగాణ ప్రభత్వం కరోనావైరస్ టెస్టులను పెంచడంతో పాటు వైరస్ కేసులను గుర్తించడం ఆపై చికిత్స అందించడం వంటి వాటిపై దృష్టి సారించాలని కోరారు.
టెస్టులు ఎన్ని ఎక్కువ చేస్తే అంత త్వరగా కరోనావైరస్ను నియంత్రించగలిగే అవకాశాలు ఉన్నాయని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో తానే స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పిన కిషన్ రెడ్డి... అక్కడ 84శాతం రికవరీ రేటు ఉందని వెల్లడించారు. అందుకే ఢిల్లీలో ఎలాగైతే కరోనా కట్టడిని నిలువరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయో అలాంటి మోడల్ను అన్ని రాష్ట్రాలు ఫాలో కావాలని అమలు చేయాలని కోరారు. తెలంగాణలో రానున్న రోజుల్లో అవసరం మేరకు కేంద్రం పీపీఈ కిట్లు వెంటిలేటర్లను సరఫరా చేస్తుందని చెప్పారు.
ఇదిలా ఉంటే కోవిడ్-19 పై పోరులో ముందున్న వైద్యసిబ్బంది పట్ల తెలంగాణ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించకూడదని వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని హాస్పిటల్స్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్రం నుంచి 1200 వెంటిలేటర్లు అందాయని చెప్పిన మంత్రి... ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు ,హెచ్సీక్యూ టాబ్లెట్లు కూడా పంపుతామని చెప్పారు.
లక్షణాలు ఉన్న పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సిందిగా మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బయట తిరగకూడదని చెప్పిన మంత్రి కరోనావైరస్ పై పోరుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు. కరోనావారియర్లకు ప్రోత్సహాకాలు ప్రకటించాలని కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మహమ్మారిపై విజయం సాధించేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి ఇన్సెన్టివ్స్ ప్రకటించడం ద్వారా వారిని ప్రోత్సహించాలని కోరారు. అంతేకాదు చికిత్స కోసం ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లకుండా ప్రభుత్వ హాస్పిటల్స్కు వెళ్లాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నందున ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలని కోరారు.