తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
తెలంగాణలో తొలిరోజు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. టీకా తీసుకున్నవారిలో 20 మందిలో మైనర్ రియాక్షన్స్ మినహా ఎవరికీ ఎలాంటి సమస్యలు తలెత్తలేదన్నారు. దీంతో టీకా సురక్షితమేనని రుజువైందన్నారు. మైనర్ రియాక్షన్స్ వచ్చినవారిలో టీకా వేసిన చోట దద్దుర్లు,ఎర్రగా మారడం వంటివి కనిపించాయన్నారు. అలాంటి వాటిపై తాము అవగాహన కల్పిస్తున్నామన్నారు.
వ్యాక్సిన్ తీసుకున్నవారి ఆరోగ్యాన్ని కొన్ని రోజుల పాటు పర్యవేక్షిస్తామని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజుల తర్వాత శరీరంలో యాంటీ బాడీస్ విడుదలవుతాయని తెలిపారు. మొదటి డోస్ ఎక్కడైతే తీసుకుంటారో... అదే కేంద్రంలో రెండో డోసు కూడా తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కోవిడ్ 19 నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ప్రతీ ఆరోగ్య కేంద్రంలో 100 టీకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 104 నంబర్కు ఫోన్ చేస్తే వ్యాక్సిన్పై సందేహాలను హెల్త్ కేర్ సిబ్బంది నివృత్తి చేస్తారని చెప్పారు.తెలంగాణలో తొలిరోజు 140 కేంద్రాల్లో 3530మందికి కరోనా టీకా అందించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియ కోసం రెండు నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించారని చెప్పారు. కరోనాపై పోరులో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుండి నడిపించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు,వ్యాక్సిన్ సప్లై చేసిన కేంద్ర ప్రభుత్వానికి డా.శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే.గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారిగా పనిచేస్తున్న ఎస్ కృష్ణమ్మ తొలి కరోనా టీకా తీసుకున్నారు. తద్వారా రాష్ట్రంలో కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులోకి ఎక్కారు. మంత్రి ఈటల రాజేందర్ కూడా టీకా తీసుకుంటానని చెప్పినప్పటికీ ప్రధాని మోదీ హెచ్చరికతో ఆయన వెనక్కి తగ్గారు.