రంజాన్ మాసం..కిటకిటలాడాల్సిన ఛార్మినార్ షాపింగ్ వెలవెలబోతోంది..!కారణం అదేనా..?
హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం.. మరో మూడు రోజుల్లో పర్వదినం. ముత్యాల నగరంగా పేరున్న హైదరాబాద్ సిటీలో ఏ మూల చూసినా షాపింగ్ లతో కళకళలాడాల్సిన పరిస్థితులు ఉండాలి. కాని అందుకు విరుద్దమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. రంజాన్ మాసం అనగానే పాత నగరంతో పాటు చార్మినార్ పరిసర షాపింగ్ సెంటర్లు కొనుగోలు దారులతో కిటకిటలాడుతుంటాయి. కాని ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఛార్మినార్ ప్రాంతంలోని షాపులన్నీ వెలవెలబోతున్నాయి. రెండునెలలుగా జీవనోపాది కోల్పోవడంతో ప్రజల ఆర్ధికంగా చితికిపోయారని, అందుకే రద్దీగా ఉండాల్సిన షాపులన్నీ బావురుమంటున్నాయని షాపు యజమానులు చెప్పుకొస్తున్నారు.
లాక్డౌన్ ప్రభావం.. రంజాన్ శోభను కోల్పోయిన ఛార్మినార్..
ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినం సమీపించింది. నెల మొత్తం ఉపవాస దీక్షలతో పరమపవిత్రంగా దైవారాధనలో మునిగి తేలిన ముస్లింలు నెలరోజుల తర్వాత కనిపించే నెలవంకతో ఉపవాస దీక్షలు విరమించి రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యులు కొత్త దుస్తులు, కొత్త చెప్పులు, ప్రతీది కొత్తగా కొనుగోలు చేసుకుని ధరించడం ఆ రోజు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇర ముస్లిం మహిళలైతే ప్రత్యేక అలంకరణ వస్తువులు కొనుగోలు చేసేందకు ఆసక్తి చూపిస్తుంటారు.
రెండునెలలుగా జీవనోపాది లేదు.. ఇక కొనుగోలు ఎలా ఉంటుందంటున్న షాపు యజమానులు..
ఈ నేపథ్యంతో ముత్యాల సిటీగా పేరు పొందిన హైదరాబాద్ పాత నగరంలో రంజాన్ మాసం సందర్బంగా కొనుగోళ్లు తారా స్థాయిలో సాగుతుంటాయి. ఛార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రతి షాపు కూడా కొనుగోలు దారులతో కిటకిటలాడుతుంటాయి. సాధారణ ఫుట్ పాత్ దుకాణం నుండి ఓ మోస్తరు షాపు వరకు కొనుగోలు దారులతో నిండిపోతాయి. కొత్త వస్త్రాలు, చెప్పులు, జ్యువెలరీ, సెంట్ బాటిల్స్, టోపీలు, అన్నీ కూడా కొత్తవే కోనుగోలు చేసుకుని ఆరోజు అంటే రంజాన్ మాసం రోజు ధరించే విధంగా ముందస్తు జాగ్రత్తలు చూసుకుంటారు.
కిటకిటలాడాల్సిన పాతనగరం షాపులు.. నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి..
ఒక్క అలంకరణలకు సంబంధించినవే కాకుండా ఇంట్లో వంటలతో పాటు ప్రత్యేక తీపి వంటకాలకు కావాల్సిన దినుసులను కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు ముస్లిం సోదరులు. అందుకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువ మోతాదులో కొనుగోలు చేసి ముస్లిం సోదరులకు ఇష్టమైన షీర్ కుర్మా తయారు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. కాని పాత నగరంలోని డ్రైఫ్రూట్స్ షాపులు కూడా కొనుగోలుదారులు లేకపోవడంతో వెలవెలబోతున్నాయి. దీంతో దుబాయి, అబుదాబి, సౌదీ వంటి దేశాల నుండి దిగుమతి చేసుకున్న డ్రై ఫ్రూట్స్ షాప్స్ కు కొనుగోలుదారుల లేకపోవడంతో దిగాలుపడ్డట్టు తెలుస్తోంది.
ఈ సారి షీర్ కుర్మాలో తీపి తక్కువే.. లాక్డౌన్ ప్రభావం అంటున్న విశ్లేషకులు..
కరోనా మహమ్మారి వల్ల కుప్పకూలిన ఆర్ధిక రంగం రంజాన్ పర్వదినం మీద బాగా ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండు నెలలుగా జీవనోపాది లేకపోడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముస్లింలు ఈ సారి రంజాన్ పర్వదినాన్ని అంత గొప్పగా నిర్వహించుకునే పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది. ప్రతియేడు రంజాన్ మాసంలో ఇసుకేస్తే రాలనంత జనం ఛార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న షాపుల్లో కొనుగోలు చేస్తుంటారని, కాని ఈ సంవత్సరం మాత్రం చూద్దామన్నా కొనుగోలు దారులు ఛార్మినార్ పరిసర ప్రాంతాలకు రావడం లేదని షాపు యజమానులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో రంజాన్ సందర్బంగా ఎంతో ప్రియంగా చేసుకునే షీర్ కుర్మా అంత తీయగా ఉండకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.