సీఐడీ శాఖకు అవినీతి చీడ..! లంచగొండి అదికారితో పోలీసు శాఖకు మచ్చ..!!
హైదరాబాద్ : పోలీసు శాఖలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు ఎన్ని మార్గదర్శకాలు రూపొందిస్తున్నా అవి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోతున్నాయి. పోలీసు శాఖలో ఉన్న కొందరి బుద్ది గడ్డి తింటుండడంతో పారదర్వకంగా పనిచేస్తున్న ప్రభుత్వాలు నిందలపాలు కావాల్సి వస్తోంది. ఇప్పటికి కొంత మంది పోలీసు ఉన్నతాది కారులు తమ వైఖరి మార్చుకోక పోవడంతో మొత్తం డిపార్ట్ మెంట్ కే కాకుండా ప్రభుత్వానికి కూడా చెడు పేరు వస్తోంది. తాజా గా సీఐడీ శాఖలో ఓ అదికారి అవినీతుకి పాల్పడిన అంశం పై డీజిపికి ఫిర్యాదు అందడం సంచలనంగా మారింది.
కేసుల దర్యాప్తులో కాసులపైనే అధికారుల దృష్టి..! సీఐడీకి ముడుపుల చీడ..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఐడీని తెలంగాణ సీబీఐగా మారుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ ప్రకటనతో, ఏదైనా కేసు సీఐడీకి వచ్చిందంటే నిందితుల పని అయిపోయినట్లేనని అంతా అనుకున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. నిందితుల పనైపోవడం మాటేమోగానీ, దర్యాప్తు అధికారులు కాసుల పంట పండించుకుంటున్నారు. కేసుల దర్యాప్తును గాలికి వదిలి ముడుపులపైనే దృష్టి సారిస్తున్నట్లు వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి. సీఐడీలో అధికారులు, సిబ్బంది చేతివాటానికి సంబంధించి గతంలో పలు విమర్శలు రాగా, తాజాగా ఓ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిపై బాధితుడు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేశాడు. శాఖాపరమైన విచారణలో వాస్తవం నిర్ధారణ కావడంతో సదరు సీఐడీ సీఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
నిందితులకు సహకరిస్తామంటూ బేరసారాలు..! లంచాలను దండుకుంటున్న అదికారులు..!!
కొందరి చర్యల వల్ల మొత్తం పోలీస్ శాఖ పరువు పోతుందనే ఉద్దేశంతో విషయాన్ని బయటకు చెప్పేందుకు కూడా అధికారులు ఇష్టపడటం లేదు. సీఐడీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ, బోధన్ కుంభకోణంలో దర్యాప్తు అధికారులపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. కొందరిపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. వారిపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉండగా.. తాజాగా సీఐడీలో మరో అధికారి చేతివాటం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివారులోని ఓ స్థలం వివాదానికి సంబంధించి సీఐడీలోని జీవోడబ్ల్యూకు ఫిర్యాదు వచ్చింది.
గతంలో ఎంసెట్, బోధన్ స్కాం..! నేడు స్థలవివాదంలో లంచం తీసుకున్న సీఐ..!!
అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కాపాడేందుకు సదరు ఇన్స్పెక్టర్ లక్షల రూపాయల్లో బేరం కుదుర్చుకున్నట్లు, అతని వద్దనుంచి కొంత మొత్తం తీసుకున్నట్లు తెలిసింది. చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమోగానీ.. నిందితుణ్ని అరెస్టు చేయక తప్పలేదు. దీంతో బాధితుడు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేశాడు. డీజీపీ ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు అంతర్గత విచారణ జరిపి ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు.
ఆది నుంచి అదే తీరు..! గతంలో నూ హెచ్చరికలు అందుకున్న ఆఫీసర్..!!
గతంలోనూ కీలక కేసుల్లో సీఐడీలోని కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. నకిలీ బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం కలిగించిన బోధన్ కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం కేసులో కొందరు అధికారులు నిందితుల నుంచి ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై శాఖాపరమైన విచారణ చేపట్టగా.. కేసులో నిందితుడు శివరాజ్, అతని కుమారుడు సునీల్తో బేరసారాలు జరిగినట్లు తెలిసింది.ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ కేసులోనూ లక్షల రూపాయలు వసూలు చేశారనే అభియోగంపై ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది.