కాళేశ్వరంలో రూ.5 వేల కోట్ల అవినీతి.. నాగం జనార్దన్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 4 ప్యాకేజీలకు సంబంధించి పంపులు, మోటార్ల కొనుగోళ్ల విషయంలో రూ.5,662 కోట్ల అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ 6, 8, 10, 11లలో పంపులు మోటార్లకు బీహెచ్ఈఎల్ సప్లై చేసిన ధర రూ.1686 కోట్లు మాత్రమేనని అన్నారు. అగ్రిమెంట్ వ్యాల్యూ మాత్రం రూ.7348 కోట్లు చూపించారని తెలిపారు. దీంతో 5 వేలకు పైగా కోట్ల అవినీతి జరిగిందన్నారు.
Recommended Video
తనకు ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసిందని నాగం జనార్దన్ రెడ్డి వివరించారు. వాస్తవ ధరకు, ప్రభుత్వం చూపిన అగ్రిమెంట్ ధర మధ్య తేడా రూ. 5662 కోట్లు ఉందన్నారు. ఇన్ని వేల కోట్ల ప్రజా ధనం ఎవరి చేతుల్లోకి వెళ్లిందని అడిగారు. దోపిడీలో ప్రభుత్వ పెద్దల వాటా ఎంత అని ప్రశ్నించారు. బీహెచ్ఈఎల్, ప్రభుత్వం నుంచి.. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించానని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రూపురేఖలు మారిపోనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. రివర్స్ పంపింగ్ ద్వారా నల్గొండ వరకు సాగునీరు మళ్లిస్తామని తెలిపింది. అయితే ఇందులో అవినీతి కూడా భారీగానే జరిగిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ డేటాను నాగం జనార్ధన్ రెడ్డి వివరించారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజా సొమ్ము వేల కోట్లను అప్పనంగా నొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. పైకి ప్రాజెక్టులు అని చెప్పి.. అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.