పెళ్లింట మోగిన చావు బాజా, షాపింగ్ కోసం వెళ్తే కబళించిన మృత్యువు, రైలు ఢీ కొని...
హైదరాబాద్ చందానగర్లో పెళ్లింట విషాదం నెలకొంది. మరికొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న జంట ప్రమాదవశాత్తు చనిపోయారు. ఎంఎంటీఎస్ రైలు ఢీ కొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లింట చావు బాజ మోగడంపై కుటుంబసభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. ఒక్కటి కానున్న దంపతులు అర్దాంతరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లడంపై ప్రతీ ఒక్కరు కంటతడి పెట్టారు.
చందానగర్ పాపిరెడ్డినగర్కు చెందిన సోని, మనోహర్కి ఇటీవలే నిశ్చితార్థం అయ్యింది. మరో రెండునెలల్లో వారికి వివాహన్ని పెద్దలు నిశ్చయించారు. పెళ్లి పనుల్లో పెద్దలు బిజీగా ఉన్నారు. బట్టలు కొనేందుకు కోసం అని మంగళవారం బయల్దేరారు. అయితే వారు ఇంటి నుంచి అండర్ పాస్ నుంచి రావాలి.. కానీ దారి బాగోలేకపోవడంతో ఎంఎంటీఎస్ పట్టాల నుంచి మీదుగా దాటే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే మృత్యువు వారిని కబళించింది.
ఎంఎంటీఎస్ రైలు పట్టాల నుంచి దాటే ప్రయత్నం చేస్తుండగా.. రైలు ఒక్కసారిగా వారి మీదినుంచి వెళ్లిపోయింది. వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. షాపింగ్కు కోసం అని వెళ్లిన వారు చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. షాపింగ్ కోసం బయల్దేరిన సోని, మనోహర్ విగతజీవులుగా మారారు. పసుపు బట్టలు వేసుకోవాల్సిన వారు అనంతలోకాలకు వెళ్లిపోయారు.
అండర్ పాస్ పనులు పూర్తికాకపోవడంతోనే తొందరగా వెళ్లే ప్రయత్నంలో దుర్ఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు. అండర్ పాస్ పూర్తయితే సమస్య తలెత్తపోవచ్చని పేర్కొన్నారు. సోని, మనోహర్ మృతికి కారణం అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు. మరోవైపు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలను ఆరాతీస్తున్నారు.