వేధింపులు తట్టుకోలేకపోయారు.. కన్న పేగును కడతేర్చారు...
హైదరాబాద్ : ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమను మించింది లేదంటారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు ఎలాంటి తప్పులు చేసినా కుడుపున దాచుకుంటారు. కానీ పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకున్న కొడుకే ప్రత్యక్ష నరకం చూపిస్తుండటంతో విసిగిపోయారు. కొడుకు రాక్షసత్వాన్ని భరించలేని ఆ తల్లిదండ్రులు కన్నప్రేమను చంపుకున్నారు. కిరాయి మనుషులతో కలిసి అతన్ని కడతేర్చారు. మానవత్వానికే మాయని మచ్చగా నిలిచే ఈ ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది.
మద్యానికి బానిసై
తాగుడుకు బానిసైన కొడుకు వేధింపులు భరించలేక తల్లిదండ్రులు యువకున్ని హత్య చేయించిన ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ఠాణా పరిధిలో సంచలనం సృష్టించింది. ఈ నెల 11న గుర్తు తెలియని వ్యక్తి పుర్రె, అస్థికలు బయటపడటంతో హత్య ఘటన వెలుగుచూసింది. కాప్రా మండల పరిధిలోని వంపుగూడ కాలనీకి చెందిన శ్రీనివాస్, మణెమ్మ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కాప్రా మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారి పెద్ద కొడుకు సాయికుమార్ చదువు మధ్యలోనే మానేసి పెయింటర్గా పనిచేస్తున్నాడు. చెడు సావాసాల కారణంగా సాయికుమార్ మద్యానికి బానిసయ్యాడు.
రాళ్లతో కొట్టి, బీరు సీసాతో గొంతు కోసి
మద్యానికి బానిసైన సాయి కుమార్ ఆ మత్తులో నిత్యం తల్లిదండ్రులు, సోదరుడితో తరుచూ గొడవ పడుతుండేవారు. ఏప్రిల్ 25న శ్రీనివాస్ దంపతుల పెళ్లిరోజు కావడంతో వారి కూతురు పుట్టింటికి వచ్చి వెళ్లింది. ఈ విషయం తెలిసి సాయి కుమార్ 26న తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడి తల్లిపై చేయి చేసుకున్నాడు. రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చిన చిన్న కొడుకు సందీప్కు విషయం తెలిసి ఆగ్రహానికి గురయ్యాడు. సాయికుమార్ ప్రవర్తనతో విసిగిపోయిన కుటుంబసభ్యులు ఎలాగైనా అతని పీడ వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. చిన్న కొడుకు సందీప్ తన స్నేహితులైన ఇబ్రహీం, గిద్యాల సందీప్, ఫయాజ్లను తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అతన్ని అంతమొందిస్తే కొంత డబ్బు ఇస్తామని వారికి చెప్పారు. అందుకు వారు అంగీకరించడంతో పథకం ప్రకారం సందీప్ అతని స్నేహితులు అర్థరాత్రి సాయికుమార్ను బయటకు తీసుకెళ్లారు. వంపుగూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో అతన్ని రాళ్లతో కొట్టి బీరు సీసా పగలగొట్టి గొంతుకోసి చంపేశారు.
అనుమానం రాకుండా ఫిర్యాదు
సాయికుమార్ హత్య అనంతరం అతని తల్లిదండ్రులు ఎవరికీ అనుమానం రాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 3న జవహర్ నగర్ పోలీస స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదుచేశారు. కొన్నాళ్లకు సందీప్ తన అన్న హత్య విషయాన్ని స్థానికంగా ఉండే ఓ నాయకుడికి తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 11వ తేదీన పోలీసులు బ్యాంకు కాలనీ సమీపంలో ఓ వ్యక్తి పుర్రె, ఎముకలు గుర్తించారు. దీంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. మృతుడు తల్లిదండ్రులు, సోదరుడు, అతని స్నేహితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఇబ్రహీం కోసం గాలిస్తున్నారు.