అక్బరుద్దీన్ కేసులో కరీంనగర్ పోలీసులకు ఝలక్, ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం
హైదరాబాద్ : అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యల కేసులో కరీంనగర్ పోలీసులకు చుక్కెదురైంది. ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ అక్బరుద్దీన్ కామెంట్స్ చేసిన సంగత తెలిసిందే. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. హిందు సంస్థలు, సంఘాలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో అక్బరుద్దీన్ వివరణ ఇచ్చారు. తాను ఒక వర్గాన్ని కించపరచలేదని తన వ్యాఖ్యలనే సమర్థించుకున్నాడు. దీంతో కరీంనగర్ కోర్టు స్పందించింది. అక్బరుద్దీన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఇంతవరకు ఎందుకు కేసు రిజిష్టర్ చేయలేదని పోలీసులకు ఆక్షింతలు వేసింది.
ఇటీవల కరీంనగర్లో జరిగిన కార్యక్రమంలో అక్బరుద్దీన్ పాల్గొన్న సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో తమకు 15 నిమిషాలు సమయం ఇస్తే చాలు హిందువులను హతమారుస్తామని కామెంట్స్ చేశారు. ఆ సమయంలో బీజేపీ, ఆరెస్సెస్ భయపడ్డాయని గుర్తుచేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై కరీంనగర్ పోలీసులు విచారణ జరిపి .. న్యాయ సలహా తీసుకొని ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయలేదని క్లీన్ చీట్ ఇచ్చారు. దీంతో బీజేపీకి చెందిన ఓ అడ్వకేట్ కరీంనగర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనికి అక్బరుద్దీన్ వ్యాఖ్యల ఫుటేజీని కూడా జతపరిచారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సరైన విచారణ జరుపకుండా తప్పుచేయలేదని ఎలా చెబుతారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించిన కోర్టు .. కరీంనగర్ త్రీ టూన్ పోలీసులు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అక్బరుద్దీన్పై 153 ఏ కింద కేసు నమోదు చేయలేదని సూచించింది. దీంతోపాటు 153బీ, 506 కింద కూడా కేసు కట్టాలని పేర్కొంది.
కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాహసన్ రెడ్డిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్కు ఎలా క్లీన్ చీట్ ఇస్తారని ప్రశ్నించింది. అక్బరుద్దీన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిలేదని కమలాహసన్ చెప్పడాన్ని బీజేపీ తప్పుపట్టింది. బీజేపీ, ఆరెస్సెస్లను తిడుతున్న అక్బరు వీడియో కనిపించడం లేదా అని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ప్రశ్నించారు. దీనిపై సీపీ కమలాహసన్పై కేసు పెడతామని తెలిపారు.