ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు ..ఆర్టీసీ సమ్మెపై జయప్రకాష్ నారాయణ్ కీలక వ్యాఖ్యలు
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో కేసు కొనసాగుతుంది. నేడు తుది తీర్పు ఇస్తారని అంతా భావించినా తీర్పు రేపటికి వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం. ఇప్పటికే పలు మార్లు ఆర్టీసీ సమ్మె విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కోర్టులు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించలేవని ఆయన పేర్కొన్నారు.
సత్యవతి రాథోడ్ కు ఆర్టీసీ కార్మికుల నిరసన సెగ .. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
ఆర్టీసీ సమ్మెపై గతంలోనే స్పందించిన లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు సరైనవి కావంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ జేపీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణా రాష్ట్రంలో ఆసక్తికరంగా మారాయి. గతంలోనే జయప్రకాశ్ నారాయణ్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి అంశాలను ప్రభుత్వానికి వదిలేసి కార్మికులు కేవలం తమ హక్కులు మరియు డిమాండ్ల గురుంచి ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇక ఈ నేపధ్యంలోనే తాజాగా మరోమారు ఆయన ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని చెప్పారు. పరిపాలనలో ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఇక అలాంటప్పుడు హైకోర్టు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేదని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్, విధానపరమైన నిర్ణయాలు కోర్టులు చేయలేవని జయప్రకాశ్ నారాయణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఇరుపక్షాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని మరోమారు ఆయన సూచించారు. సామరస్యపూర్వకంగా సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక జేఏసీ ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తానుపట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా వ్యవహరించటంతో ఆర్టీసీ కార్మిక సమ్మె 40 వ రోజుకు చేరుకుంది.