సర్జరీలపై కరోనా వైరస్ ఎఫెక్ట్: నిమ్స్ సంచలన నిర్ణయం: సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా.. !
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా కట్టుతప్పుతున్నట్టు కనిపిస్తోంది. ఒక్కరోజులోనే ఏడు కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో కోవిడ్-19 లక్షణాలు కనిపించాయి. వారిని ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి వికారాబాద్, దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ఐసొలేషన్ వార్డులను నెలకొల్పింది.
రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిజామ్స్ వైద్య విజ్ఙాన సంస్థ (నిమ్స్) సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. నిమ్స్ పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో ఎంపిక చేసిన సర్జరీలను నిలిపివేసింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ వెల్లడించారు.
ఈ మేరకు గురువారం ఉదయం ఉత్తర్వులను జారీ చేశారు. వైద్య విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు తాము ఈ నిర్ణయాన్ని తీసకున్నట్లు తెలిపారు.
Recommended Video
ఎంపిక చేసిన సర్జరీలు మాత్రమే నిలిపివేశామని ఆయన స్పష్టం చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో రోజువారీ అవుట్ పేషెంట్ల విభాగం సేవలు యధాతథంగా కొనసాగుతాయని అన్నారు. అత్యవసర సర్జరీలు, అత్యవసర విభాగం సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెల్లడయ్యేంత వరకూ తాము ఎంపిక చేసిన సర్జరీలను నిలిపివేసినట్లు సత్యనారాయణ చెప్పారు. నిమ్స్ పరిధిలోని అన్ని సాధారణ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అన్నారు.