కరోనా విలయం:తెలంగాణకు గుడ్న్యూస్ - ప్రతిష్టాత్మక TIMS లో వైద్య సేవలు షురూ - కానీ..
కరోనా కేసులకు సంబందించి దేశంలోనే అత్యధిక పాజిటివ్ రేటు కలిగిన, అతి తక్కువ టెస్టులు నిర్వహిస్తోన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు భారీ ఊరట లభించింది. ప్రత్యేకంగా కొవిడ్-19 పేషెంట్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ''తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్)''లో సోమవారం నుంచి వైద్య సేవలు ప్రారంభం అయ్యాయి.
కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. అసలు కథ.. భయానక పాజిటివ్ రేటు.. రంగంలోకి కేంద్రం?
రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండటం, ప్రధానంగా రాజధాని హైదరాబాద్ పరిధిలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వాసుపత్రులకు తాకిడి పెరిగింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కొవిడ్-19 ట్రీట్మెంట్ కు ప్రభుత్వం అనుమతించింది. అయితే, ప్రజల్లో నెలకొన్న భయాలను క్యాష్ చేసుకుంటూ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దందాకు దిగడం వివాదాస్పదమైంది. ఈలోపే అతి పెద్ద ఆస్పత్రిగా భావిస్తోన్న టిమ్స్ అందుబాటులోకి రావడం ఊరటకలిగిస్తున్నది.
2003లో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ సందర్భంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నిర్మించిన స్పోర్ట్స్ విలేజ్ భవంతి తర్వాతి కాలంలో ఖాళీగా మారింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ 13 అంతస్తుల భవనాన్ని టిమ్స్ గా మార్చుతున్నట్లు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే అక్కడ 1200 మంది రోగులకు సరిపడా ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. 3 నెలలకు సరిపడా మందులులను మెడికల్ స్టోర్లో అందుబాటులో ఉంచారు. నాలుగు ఐసీయూ గదుల్లో 50 బెడ్లతోపాటు, ఎమర్జెన్సీ రోగుల కోసం 25 వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆధునిక పరికరాలనూ అందుబాటులో ఉంచారు.
కేసీఆర్ కు కరోనా - ఇష్యూలో భారీ ట్విస్ట్.. తెల్లారుజామున పోలీస్ యాక్షన్.. కిడ్నాప్ ఆరోపణలు..
ప్రతిష్టాత్మక టిమ్స్ ఆస్పత్రి కోసం ఇప్పటికే 70మంది డాక్టర్లు, 210 మంది నర్సులను కేటాయించారు. అయితే, కొవిడ్ కు సంబంధించి అతి కీలకమైన ల్యాబ్టెక్నీషియన్లు, శాంపిల్స్ సేకరించే సిబ్బంది నియామకం ఇంకా పూర్తికాలేదని, అందుకు మరో రెండు మూడు రోజుల సమయం పడుతుందంటూ కొన్ని చానెళ్లలో వార్తలు వచ్చాయి. సిబ్బంది కొరతపై వివరణ ఇవ్వనప్పటికీ, టిమ్స్ లో సేవల ప్రారంభానికే ప్రభుత్వం మొగ్గుచూపింది. ప్రజాసేవ కోసం టిమ్స్ రెడీగా ఉందంటూ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పోస్టు చేసిన వీడియో వైరల్ అయింది.
ఆదివారం రాత్రి నాటికి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,904కు చేరగా, అందులో 295 మంది ప్రాణాలు కోల్పోయారు. 12,703 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 11వేల యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతంగా ఉన్న హైదరాబాద్ లో టిమ్స్ అందుబాటులోకి రావడంతో పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశాలున్నాయి.