కరోనాపై రాచకొండ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ క్లాస్: సిగ్నల్స్ వద్ద వెహికల్స్ ఆపేసి మరీ..
హైదరాబాద్: కరోనా వైరస్ను నియంత్రించడానికి రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఓ వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరికొరికి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు నడిరోడ్డు మీదే అవగాహన కల్పిస్తున్నారు. మామూలుగా చెబితే ఎవరి బుర్రకు ఎక్కదని అనుకున్నారో ఏమో గానీ.. భగభగమండే ఎండలో, నడి రోడ్డు మీద, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలను నిలిపి వేసి మరీ.. క్లాసులు తీసుకుంటున్నారు.
కరోనాపై మెగాస్టార్ మెగా మెసేజ్: నిర్లక్ష్యంతో ప్రాణం మీదికి: గుంపుగా తిరగొద్దు.. ఇంటి దగ్గరే ఉండండి
గురువారం మధ్యాహ్నం నాచారం సమీపంలోని ఓ సిగ్నల్ వద్ద రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఈ క్లాసులు తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. సిగ్నల్ పడిన వెంటనే అయిదుమంది ట్రాఫిక్ పోలీసులు రోడ్డుకు అడ్డుగా నిల్చున్నారు. కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతోందనే విషయాన్ని వాహనదారులకు ఉదాహరణలతో సహా వివరించారు. అనంతరం- వైరస్ బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని తెలియజేశారు.
శుభ్రత పాటించడం వల్ల ఈ మహమ్మారిని దరి చేరనీయకుండా చూడొచ్చని సూచించారు. వాహనదారులందరూ తమ ఇళ్లకు లేదా, కార్యాలయాలు, దుకాణాలకు వెళ్లిన వెంటనే చేతులను శుభ్రం చేసుకోవాలని అన్నారు. చేతులు, చేతి వేళ్లను ఎలా శుభ్రం చేసుకోవాలనే విషయాన్ని తాము చేసి మరీ.. చూపించారు. 20 సెకెన్లకు తగ్గకుండా చేతులను శుభ్రం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు వివరించారు.
కరోనాపై రాచకొండ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ క్లాస్: సిగ్నల్స్ వద్ద వెహికల్స్ ఆపేసి మరీ..#TrafficPolice #Hyderabad #Telangana #Rachakonda #Covid19 #Coronavirus #SARSCoV2 pic.twitter.com/LBrWgnm1ed
— Oneindia Telugu (@oneindiatelugu) March 19, 2020
తుమ్మినా, దగ్గినా అర చేతులతో కాకుండా మోచేతులతో ముఖాన్ని అడ్డుగా పెట్టుకోవాలని చెప్పారు. ఒక వ్యక్తి దగ్గినా లేదా తుమ్మినా దాని తీవ్రత ఆరు అడుగుల వరకు ఉంటుందని, అందుకే మోచేతిని ఎల్ షేపులో అడ్డుగా పెట్టి తుమ్మాలని అన్నారు. ప్రతి వ్యక్తికి కూడా ఒక మీటర్ దూరాన్ని తప్పనిసరిగా పాటించి తీరాలని అన్నారు. ఒక వ్యక్తి నుంచి కరోనా వైరస్ మీటర్ లేదా అంతకంటే దూరంగా ఉన్న వ్యక్తికి సోకకపోవచ్చని చెప్పారు.