హైదరాబాదులో గడప దాటని బతుకమ్మ, ప్రకృతి ప్రకోపానికి పండగలు వరదపాలు..
హైదరాబాదు: దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోని ప్రజలు శరన్నవరాత్రుల వేడుకలు జరుపుకుంటుండగా... హైదరాబాద్ నగర ప్రజలు మాత్రం ఆ ఊసే మరిచారు. ప్రాణాలతో బతికి బట్ట కడితే చాలని భావిస్తున్నారు. బతికుంటే పండగ తర్వాతైనా జరుపుకోవచ్చని చెబుతున్నారు.
ఇంటి గడప దాటని బతుకమ్మ
హైదరాబాద్ మహానగరం... దేశంలోని అన్ని రాష్ట్రాల వారికి సొంతింటిగా మారిన అద్భుతమైన నగరం. ప్రస్తుతం ఈ నగరం ప్రకృతి ప్రకోపానికి కకావికలైంది. పుట్టకొకరు చెట్టుకొకరుగా మిగిలారు. ఇక పండగంటూ ఒకటుందనే సంగతే మరిచారు. సాధారణంగా దసరా పండగ వస్తుందంటే చాలు ఆ శోభ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎటు చూసినా ప్రధాన కూడళ్లలో బతుకమ్మ పాట వినిపిస్తుంది. మహిళలు చక్కగా ముస్తాబై బతుకమ్మ పాటలు పాడుతూ సందడిగా కనిపిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం కరోనా, వరదల కారణంగా భాగ్యనగరం అభాగ్యనగరంగా మారిపోయింది. పండగ ఊసే లేదు. బతుకమ్మ ఇంటి గడప దాటడం లేదు.
కరోనాతో భయపడుతున్న జనంకు జలప్రళయం...
హైదరాబాదులో ఎటు చూసినా వరదనీరే దర్శనమిస్తోంది. ప్రధాన షాపింగ్ సెంటర్లన్నీ మూసుకున్నాయి. ఎక్కడా సందడి కనిపించడం లేదు. ఇక షాపింగ్కు కేరాఫ్గా నిలిచే సికింద్రాబాద్, చార్మినార్, అమీర్పేట్ లాంటి ప్రాంతాలు సందడిలేక బోసిపోయాయి. ఇక ప్రతి ఏటా ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వరదల కారణంగా ఆ వేడుకల నిర్వహణపై ఇంకా క్లారిటీ రాలేదు. అసలే కరోనావైరస్తో ప్రజలు భయాందోళనలో ఉండి వేడుకలను పండుగలను ఇంటికే పరిమితం చేసుకుంటుండగా... పుండుపై కారం చల్లినట్లుగా ఈసారి వరదలు మహానగరంపై పగబట్టాయి.
రిలీఫ్ క్యాంపుల్లో కరోనా..
ఇదిలా ఉంటే మరో మూడు రోజుల పాటు హైదరాబాదులో వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో ప్రజలు పండగను మరిచి సురక్షితంగా ఉండేందుకు మాత్రమే ప్రాధాన్యత చూపుతున్నారు. గతవారంలో భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 70 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఓల్డ్ సిటీ దాదాపుగా మునిగిపోవడంతో ప్రజలంతా రిలీఫ్ క్యాంపుల్లో కాలం వెల్లదీస్తున్నారు. అయితే ఇక్కడ కూడా మరో ఇబ్బంది వచ్చి పడింది. రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నవారికి కరోనా సోకడం మరో ఆందోళనకు దారి తీసింది. ఇక వ్యాపారాలు లేక వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు.
బోసిపోయిన ప్రధాన షాపింగ్ మాల్స్
సాధారణంగా దసరా, దీపావళి పండగలు అక్టోబర్- నవంబర్ నెల మధ్య వస్తుంటాయి. ఈ సమయంలో వ్యాపారస్తులకు పండగకు మించి పండగ అని చెప్పొచ్చు. కానీ కరోనా కారణంగా వ్యాపారం చాలా డల్గా మారిపోగా ఇప్పుడు వరదలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తడంతో వారు కూడా చాలా నష్టాల్లోకి కూరుకుపోయారు. కొన్ని దుకాణాల్లోకి వరద నీరు ప్రవేశించడంతో సరుకు మొత్తం నీటిపాలైందని లబోదిబోమంటున్నారు వ్యాపారస్తులు. దసరా దీపావళికి బిజినెస్ చాలా బాగా జరుగుతుందని కానీ ఈ సారి ప్రకృతి మహానగరంపై పగబట్టినట్లు కనిపిస్తోందని అందుకే వ్యాపారం పూర్తిగా బోసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులకు బ్రేక్
ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు కనిపించకపోవడంతో కూడా పండగ శోభ మరుగున పడింది. గతేడాది దసరా దీపావళి పండగలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 3000 బస్సులు నడిచాయి. కానీ ఈ సారి మాత్రం లాక్డౌన్ కారణంగా బస్సు సర్వీసులకు బ్రేక్ పడింది. అన్లాక్ దిశగా దేశం వెళుతున్నప్పటికీ రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని వందల మంది హైదరాబాదు నుంచి ఏపీలోని పలు జిల్లాలకు వెళ్లేందుకు బస్సులను ఆశ్రయిస్తారు. కానీ ఈ సారి ఆ వాతావరణం కనిపించడం లేదు. ఇక దీపావళి అయిపోగానే సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి అప్పుడు పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.