తగ్గిన నేరాలు, హైదరాబాద్ సిటీ సేఫ్: సీపీ అంజనీకుమార్.. పూర్తి వివరాలివో...
హైదరాబాద్లో క్రైం రేట్ తగ్గిందని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే 10 శాతం నేరాలు తగ్గాయని వివరించారు. ప్రాపర్టీ అఫెన్స్, హత్య, అత్యాచారాలు, కిడ్నాపులు, దోపిడీ దొంగతనాల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. సిటీ పరిధిలో జరిగిన ఇయర్ ఎండ్ క్రైమ్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. కేసులు, లాక్డౌన్, జీహెచ్ఎంసీ ఎన్నికలు, భారీ వర్షాల సమయంలో పోలీసులు అందించిన సేవల వివరాలను సీపీ వెల్లడించారు.
హత్యలు.. హత్యాయత్నం...
జీరో ఎఫ్ఐఆర్.. బాధితుల ఇంటి వద్దే ప్యాట్రో కార్, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. గతేడాదితో పోలిస్తే హత్యలు 24 శాతం, హత్యాయత్నం 39 శాతం, బెదిరింపులు 51 శాతం, కిడ్నాప్స్ 34 శాతం, అల్లర్లు 47 శాతం, చీటింగ్ కేసులు 35 శాతం తగ్గాయని వివరించారు. ప్రాపర్టీ అఫెన్స్ల్లో 27 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పారు. 2019తో పోలిస్తే 2020లో మహిళలపై జరిగిన దాడుల కేసులు 19 శాతం, చిన్నారులపై 35 శాతం తగ్గిందని ఆయన తెలిపారు.
పెరిగిన సైబర్ నేరాలు..
సిటీ పరిధిలో ఈ ఏడాది సైబర్ నేరాల సంఖ్య పెరిగిందని సీపీ తెలిపారు. గతేడాది 1,393 సైబర్ క్రైమ్ కేసులు రిజిసర్ట్ కాగా.. ఈసారి 2,406 నమోదు అయ్యాయని చెప్పారు. 12 రాష్ట్రాల్లో గల 259 మంది సైబర్ నేరగాళ్ళను అరెస్ట్ చేశామని వివరించారు. రెండు ఆన్లైన్ గేమింగ్ కేసుల్లో 14 మందిని అరెస్ట్ చేసి 170 బ్యాంక్ అకౌంట్లను గుర్తించామని వివరించారు. రూ.1600 కోట్లు ఫ్రీజ్ చేశామన్నారు. 250కి పైగా లోన్ యాప్స్ గుర్తించామని.. ఈ నెల 20 వరకు 39 బాధితుల నుంచి కంప్లయింట్స్ రాగా..వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. 84 డ్రగ్స్ కేసుల్లో 213 మందిని అదుపులోకి తీసుకుని 851 కిలోల గంజాయి, 1,158 గ్రాముల డ్రగ్స్ ను సీజ్ చేశామని వివరించారు. 109 మంది నేరస్తులపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించామని వివరించారు.
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్..
సిటీ పరిధిలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై 54,35,892 కేసులు రిజిస్టర్ చేశామని సీపీ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ 5,591 మందిలో 629 మందికి జైలు శిక్షలు విధించేలా ఛార్జ్ షీట్స్ ఫైల్ చేశామని తెలిపారు. 9 డ్రైవింగ్ లైసెన్స్లను క్యాన్సిల్ చేయించామని వివరించారు. డ్రంకన్ డ్రైవ్ నిందితులకు కోర్టు ద్వారా రూ.5.20 కోట్లు ఫైన్స్ వేశామని చెప్పారు. 9 రకాల ట్రాఫిక్ వయోలేషన్స్లో మొత్తం 45,44,432 చలాన్స్ జనరేట్ చేశామని చెప్పారు. ఈ ఏడాది 2,265 రోడ్ యాక్సిడెంట్లలో 305 మంది మృతి చెందగా 2,267 మంది గాయపడ్డారని సీపీ అంజనీకుమార్ తెలిపారు.