హైకోర్టులో ఆర్టీసీపై కీలక విచారణ..! ప్రభుత్వంతో పాటు ఆర్టీసి ఉద్మోగుల్లో నెలకొన్న ఉత్కంఠ..!!
హైదరాబాద్ : ఆర్టీసి కార్మికులు తలపెట్టిన సమ్మె 50వ రోజు దిశగా పరుగులు తీస్తోంది. ఆందోళనలు ఉదృతంగా మారి ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులు అరెస్టులకు గురౌతున్నారు. న్యాయస్దానం కల్పించుకుని ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ఔదార్యం చూపించి చర్చలు జరిపి సమ్మెను శాంతియుత వాతావరణంలో పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ సూచనలు చేసినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఆర్టీసి కార్మికులతో చర్చలు జరపలేమని ప్రభుత్వం కోర్టుకు పలుసార్లు స్పష్టం చేసింది. దీంతో సమ్మె యధావిధిగా కొనసాగుతున్నట్టు జేఏసి నేతలు సష్టం చేసారు.
గమ్యం లేని ప్రయాణంలా మారిన ఆర్టీసి సమ్మె..! దారి చూపాల్సింది ఇక న్యాయస్థానమే..!!
50వ రోజు దిశాగా సమ్మె పరుగులు.. పట్టు వీడని ప్రభుత్వం, ఉద్యోగులు..
ఆర్టీసి చేస్తున్న సమ్మెపై తెలంగాణ హైకోర్టులో వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ సమ్మె, ప్రయివేటీకరణ అంశాలపై సోమవారం మద్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. సమ్మె, ప్రయివేటీకరణ అంశాలపై అడిషనల్ అఫిడవిట్ ను ఆర్టీసీ, ప్రభుత్వం ధాఖలు చేశాయి. ఈ అఫిడవిట్ లో.. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ప్రతి పక్షాలు, యూనియన్లు పన్నాగం పన్నారని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పేర్కొన్నారు. అలాగే, ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం అన్ని, ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని, కార్మికుల డిమాండ్లు పరిష్కరించలేమని తెలిపారు. దీనిపై నేడు కీలక విచారణ జరగనుంది.
ఆర్టీసి ఎండీ అఫిడవిట్ తప్పుల తడక.. రాజకీయ అంశాలను జొప్పిస్తున్నాంటున్న జేఏసీ..
ఆర్టీసి సమ్మె పట్ల ప్రభుత్వం పట్టు వీడటం లేదు. పండగ సమయంలో చేసిన సమ్మె వల్ల ఆర్టీసీ మరింత నష్టాల్లో కూరుకు పోయిందని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. కార్మికులు స్వచ్ఛందంగా విధుల్లో చేరాలనుకున్నప్పటికి వారిని తిరిగి ఉద్యోగాల్లో తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు ఆర్టీసి ఎండి స్పష్టం చేస్తున్నారు. కార్మిక నేతల మాటలు నమ్మి కార్మికులు సమ్మెకు వెళ్లి ఇప్పుడు నష్టపోతున్నారన్నారు. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కూడా సమ్మె లోకి దిగారన్నారు. కాగా, ప్రభుత్వ అఫిడవిట్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. ఆర్టీసీ ఎండీ. అఫిడవిట్ తప్పుల తడక అని, రాజకీయాలతో ముడిపెట్టి తప్పించుకునేల ప్రయత్నం చేస్తున్నట్టు జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు.
రూట్ల ప్రయివేటీకరణపై నేడు కీలక విచారణ.. సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ..
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రూట్ల ప్రయివేటీకరణ నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. 5100 రూట్ల ప్రయివేటీకరణ పై అదనపు అఫిడవిట్ ను సీఎస్ ధాఖలు చేశారు. ప్రయివేటీకరణపై క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఇంకా అమల్లోకి రాలేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ అంశం పై న్యాయ సమీక్ష చేయడం సరైంది కాదని తెలిపారు. రాజ్యాంగ పరిధికి లోబడి మంత్రి మండలి నిర్ణయం తీసుకుందన్నారు. ఇదే అంశం పై నేడు హైకోర్టులో స్పష్టత రానుంది. రూట్ల పర్మిట్లపై సానుకూల నిర్ణయం వెలుపడితే మాత్రం కార్మికులకు ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రూట్ల పర్మిట్ల పై జీవో ఇవ్వలేదన్న అడ్వకేట్..! విచారణ ఎందుకంటున్న ప్రభుత్వం..!!
రూట్ల పర్మిట్ల పై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఈ అంశపట్ల సంయమనం పాటించాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుని కోరారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించాడనికి కానీ, న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని తెలిపారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని పిటిషన్ ను కొట్టివేయాలని ప్రభుత్వం కోరింది. మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం నియమ నిబంధనలకు విరుద్ధంగా కేబినేట్ నిర్ణయాలు తీసుకున్నారని. 5,100 రూట్ల ప్రైవేటికరణ పై పిటిషనర్ కోర్టులో వాదనలు వినిపించనున్నారు. దీంతో నేటి విచారణ పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.