వజ్రాభరణాలకు వెండి పూత.. ఎయిర్ పోర్ట్ కార్గో ద్వారా 6.6 కోట్ల విలువ చేసే పార్సిల్ .. ఇదో కొత్త దందా
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా గోల్డ్ మాఫియా మాత్రం తమ పంధా వీడటం లేదు . అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. అయితే బంగారం స్మగ్లర్లు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎయిర్ పోర్ట్ కార్గో ద్వారా అక్రమంగా తరలించనున్న ఒక పార్సిల్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు .
గ్యాంగ్స్టర్ నయీం కేసులో 25 మంది పోలీసులకు క్లీన్చిట్ ఇచ్చిన సిట్ .. రీజన్ ఇదే !!
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కార్గో సెక్షన్ నుంచి 21 కిలోల పార్సిల్ స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జిఐఎ) లోని కార్గో సెక్షన్ నుంచి 21 కిలోల పార్సిల్ ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు , అందులో బంగారం బిస్కెట్లను, వజ్రాభరణాలను, వజ్రాలను,బంగారు ఆభరణాలు,విలువైన గడియారాలను గుర్తించారు . వాటి విలువను అంచనా వేశారు . సరైన డాక్యుమెంటేషన్ లేని విదేశాల నుండి దిగుమతి అయిన బంగారాన్ని, వెండి పూత పూసిన వజ్రాభరణాలను , ప్లాటినం చెవి పోగులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు .
తనిఖీలు చేసిన కస్టమ్స్ అధికారులు , డాక్యుమెంట్స్ లేకుండా రవాణాకు పార్సిల్
హైదరాబాద్ నుండి ఇండిగో ఫ్లైట్ ద్వారా రహస్యంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఆధారంగా, కస్టమ్స్ అధికారులు శంషాబాద్ కార్గో ప్రాంగణం, ఎయిర్ కార్గో కాంప్లెక్స్ వద్ద సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. డాక్యుమెంట్స్ సరిగా లేని ఒక పార్సిల్ లో ఉన్న వివిధ బంగారు ఆభరణాలు, విదేశాలకు చెందిన బంగారు బిస్కెట్లు , వజ్రాలు, విలువైన మరియు విలువైన రాళ్ళు, స్టెయిన్లెస్ స్టీల్ గడియారాలు, ప్లాటినం చెవి పోగులు మరియు పురాతన నాణేలు ఉన్నాయని ధృవీకరణలో వెల్లడైంది . కస్టమ్స్ యాక్ట్ 1962 మరియు సిజిఎస్టి యాక్ట్ 2017 నిబంధనల ప్రకారం మొత్తం సరుకును స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
బంగారం , పూతపూసిన వజ్రాభరణాలు గుర్తించిన అధికారులు .. 6.62 కోట్ల విలువ
స్వాధీనం చేసుకున్న బంగారం మొత్తం బరువు 2.37 కిలోలు, బంగారు ఆభరణాలు 5.63 కిలోల బరువు ఉన్నట్టు ధ్రువీకరించారు . 6.62 కోట్ల రూపాయల విలువగా నిర్ధారించారు .డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఇన్స్పెక్టర్ల బృందం పర్యవేక్షణలో తనిఖీలు జరిపి పెద్ద ఎత్తున గోల్డ్ మాఫియా అక్రమ రవాణా చేస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు . కరోనా లాక్ డౌన్ తర్వాత ఇటీవలి కాలంలో కస్టమ్స్ అధికారులు ఇంత పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకోవటం ఇదే మొదటిసారి .
Recommended Video
ముంబై ,జై పూర్ కు అక్రమంగా రవాణా.. ట్యాక్స్ కట్టని బంగారంగా గుర్తింపు
ముంబై , జైపూర్కు అక్రమంగా రవాణా చేస్తున్న దేశీయ సరుకుగా దీనిని గుర్తించారు . ఇది ఎవరి వద్ద నుండి ఎవరికి రవాణా అవుతుంది అన్న దానిపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు . ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా అడ్డదారిలో ఈ బంగారం తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు . ఎయిర్ పోర్ట్ లలో ప్రయాణీకులపైనే కాకుండా , కార్గోల ద్వారా రవాణా అవుతున్న పార్సిల్స్ పై కూడా తాజా పరిణామాలతో ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు .