iPhones : శంషాబాద్ విమానాశ్రయంలో 80 ఐఫోన్లు సీజ్... ఇద్దరి అరెస్ట్...
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో రూ.1కోటి పైచిలుకు విలువ చేసే 80 ఐఫోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఈ ఐఫోన్లను తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి ఐఫోన్లను తీసుకొస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.4లక్షలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.
విమానాశ్రయంలోని లగేజీ బెల్ట్ వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించిన సమయంలో ఐఫోన్లను గుర్తించినట్లు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జేఎస్ చంద్రశేఖర్ వెల్లడించారు. పన్నులు చెల్లించకుండా వీటిని భారత్కు అక్రమంగా తీసుకొస్తున్నారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఐఫోన్ 12ప్రో,ఐఫోన్ 12 ప్రపో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయన్నారు.
వీటి ధర ఒక్కొక్కటి రూ.1లక్ష నుంచి రూ.1లక్షన్నర వరకు ఉంటుందన్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఐఫోన్ల విలువ రూ.1.65 కోట్లు ఉంటుందన్నారు.నిందితుల్లో ఒకరు గుజరాత్కి చెందిన వ్యక్తి కాగా మరొకరు హైదరాబాద్ అబిడ్స్లోని జగదీశ్ మార్కెట్కి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఐదు రోజుల క్రితం ఇదే శంషాబాద్ విమానాశ్రయంలో రూ.20 కోట్ల విలువచేసే హెరాయిన్ డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దోహా నుంచి హైదరాబాద్కు భారీ మొత్తంలో హెరాయిన్ డ్రగ్ను తీసుకొచ్చిన జాన్ అనే వ్యక్తి... దాన్ని ఆస్ట్రేలియాకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో హెరాయిన్ను దాచి తరలిస్తున్న క్రమంలో పోలీసులు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు.
అంతకు కొద్దిరోజుల ముందే రూ.78 కోట్లు విలువ చేసే హెరాయిన్ను శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం,విదేశీ కరెన్సీ,డ్రగ్స్... ఇలా ఎప్పుడూ ఏదో ఒక అక్రమ రవాణా శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడుతూనే ఉంది. గత మే నెలలో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద రూ.11.50 లక్షల విలువైన అక్రమ విదేశీ కరెన్సీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.