ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్టులతో మోసాలు... పోలీసుల పేరుతో ఫేక్ అకౌంట్స్.. సైబర్ గ్యాంగ్ అరెస్ట్...
పోలీస్ అధికారుల పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,తమిళనాడు,హిమాచల్ ప్రదేశ్కి చెందిన పోలీసుల పేరుతో వీరు నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించినట్లు తెలిపారు. ముఠా సభ్యులైన ముస్తఖీమ్ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాం ఖాన్లను ఎస్పీ రంగనాథ్ శనివారం(అక్టోబర్ 2) మీడియా ముందు ప్రవేశపెట్టారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ జిల్లా కేత్వాడకు చెందిన వీరంతా గతంలో రోడ్లపై వెళ్లేవారిని బెదిరించి డబ్బులు లూటీ చేయడం... ఓఎల్ఎక్స్ వేదికగా ఆర్మీకి చెందిన వాహనాలను తక్కువ ధరకు అమ్ముతున్నామని చెప్పి మోసాలకు పాల్పడటం వంటివి చేసేవారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఈ రెండింటికీ అవకాశం లేకుండా పోవడంతో సైబర్ నేరాలను ఎంచుకున్నట్లు చెప్పారు.
మొబైల్ ఫోన్లు,ల్యాప్టాప్స్ ఉపయోగించి పలు రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారుల పేర్లతో ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు సృష్టించినట్లు చెప్పారు. ఆ పోలీస్ అధికారుల స్నేహితులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టడం... డబ్బులు అవసరం ఉన్నాయని మెసేంజర్లో వారికి మెసేజులు పెట్టడం చేసేవారన్నారు. దీంతో నిజంగా ఆ పోలీస్ అధికారులే డబ్బులు అడుగుతున్నారని భావించి... చాలామంది గూగుల్ పే లేదా ఇతరత్రా యాప్స్ ద్వారా డబ్బులు పంపించేవారని చెప్పారు.
Recommended Video
డబ్బుతో పలువురిని ప్రలోభపెట్టి వారి నుంచి బ్యాంకు ఖాతాలు,సిమ్ కార్డులు తీసుకుని ఈ దందా నడుపుతున్నట్లు గుర్తించామన్నారు.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,తమిళనాడు,హిమాచల్ ప్రదేశ్కి చెందిన దాదాపు 350 మంది పోలీస్ అధికారుల పేరుతో ఫేస్బుక్లో ఈ ముఠా నకిలీ ఖాతాలు తెరిచిందన్నారు. ఒక్క తెలంగాణకు సంబంధించి దాదాపు 80 మంది అధికారుల పేరుతో ఫేక్ అకౌంట్లు తెరిచినట్లు చెప్పారు. నిందితుల్లో ఒకరు మైనర్ కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ ముఠాను పట్టుకునేందుకు చాలానే శ్రమించాల్సి వచ్చిందని... రాజస్తాన్ వరకూ వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని.. ఇలాంటి ముఠాల చేతిలో మోసపోవద్దని అన్నారు.