ప్రతీ పీఎస్లో సైబర్ నిపుణులు..? తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు...
ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కవవుతున్నాయి. కాల్ చేసి ఓటీపీ తీసుకొని.. క్షణాల్లో డబ్బులను గుంజేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి సొమ్ముచేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తరచుగా ఫేస్ బుక్ అకౌంట్లు హ్యాక్ నకు గురవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ పోలీసు విభాగం ప్రతిష్టాత్మక చర్యలకు దిగుతోంది. సైబర్ మోసాలను నివారించేందుకు మార్గాలను అన్వేషించింది.
టెక్నాలజీతో ఉపయోగాలు పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో సైబర్ నేరాలకు చెక్ పెట్టడం కత్తీమీద సాములా మారుతోంది. అందుకోసం తెలంగాణ పోలీసు విభాగం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. దేశంలో తొలిసారి సైబర్ వారియర్లను తయారుచేస్తోంది. ప్రతి పోలీస్ స్టేషన్లో కనీసం ఇద్దరు లేదంటే ఐదుగురి వరకు సైబర్ యోధులుగా శిక్షణ ఇస్తారు. వీరు సమస్య మూలాలపై శోధన జరుపుతారు.
సైబర్ నేరాలను అరికట్టడం వీరి ప్రధాన వృతి. ఈ తరహా కేసులపై సాంకేతికత సాయంతో విచారణ జరుపుతారు. అంతకన్నా ముందు ప్రజల్లో అవగాహన కలిగించడం కూడా ముఖ్యమే.. సైబర్ వారియర్ల ప్రధాన పని కూడా ఇదే. దీనికి సంబంధించిన కార్యాచరణను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ప్రతీ స్టేషన్లో సైబర్ యోధులు ఉంటారని.. దీంతో సైబర్ క్రైం నేరాలను తగ్గించడమే తమ లక్ష్యమని వివరించారు.