అంగన్వాడీలో ప్లాస్టిక్ గుడ్లా.. పేరెంట్స్ ఫిర్యాదుతో పరేషాన్.. తీరా ఏమైందంటే..!
నల్గొండ : జిల్లాలో ప్లాస్టిక్ గుడ్లు కలకలం రేపాయి. అది కూడా అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన గుడ్లు కావడంతో రచ్చ రచ్చయింది. రోజువారీ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఇచ్చిన గుడ్లు ప్లాస్టిక్ గుడ్లు అంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి.
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది. అంగన్వాడీ కేంద్రంలో ప్లాస్టిక్ గుడ్లు రావడమేంటనే చర్చ జోరందుకుంది. చివరకు అధికారులు వాటిని పరిశీలించి అవి ప్లాస్టిక్ గుడ్లు కాదని తల్లిదండ్రుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.
Recommended Video
ప్లాస్టిక్ గుడ్ల కలకలం.. ఉడకబెడితే రబ్బరే..!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొందరి తీరు కారణంగా అభాసుపాలవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువై సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్నాయి. ఆ క్రమంలో నల్గొండ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఘటన అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. రోజువారీ పిల్లలకు ఇచ్చే గుడ్లు నాసిరకమని తేలడంతో జిల్లాలో చర్చానీయాంశంగా మారింది.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే నిబంధనలున్నాయి. కానీ వాటిని తుంగలో తొక్కుతున్నారు కొందరు. అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు రూల్స్ బ్రేక్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారుల అండదండలతో నాణ్యత లేని సామాగ్రి సరఫరా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
పోలీస్ శాఖలో కొత్త కొలువులు.. 15 వేల నియామకాల భర్తీకి కసరత్తు
ప్లాస్టిక్ గుడ్లు ఇచ్చారంటూ తల్లిదండ్రులు బేజారు..!
జిల్లాలోని తిరుమలగిరి మున్సిపాలిటీలోని అంగన్వాడీ కేంద్రం - 3వ నెంబర్ కేంద్రంలో సోమవారం నాడు చిన్నారులకు పంపిణీ చేసిన కోడిగుడ్లు వివాదస్పదంగా మారాయి. ఇంటికి తీసుకెళ్లాక చిన్నారుల పేరెంట్స్ వాటిని ఉడకబెట్టడంతో అసలు విషయం బయటపడింది. తెల్లగా ఉండే కోడిగుడ్లు నీలం రంగులోకి మారడమే గాకుండా తెల్లటి సొన రబ్బరులాగా సాగిందని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే అవి ప్లాస్టిక్ గుడ్లు కావొచ్చేమోననే అనుమానంతో అంగన్వాడీ సెంటర్కు వచ్చి ఫిర్యాదు చేశారు.
ఎన్నడూలేని విధంగా ఈసారి కోడిగుడ్లు రంగు మారడం.. తెల్లటి సొన రబ్బరులాగా సాగడం పేరెంట్స్ను కలవరానికి గురి చేసింది. ప్లాస్టిక్ గుడ్లు ఇచ్చారా అంటూ సెంటర్ నిర్వాహకులను అడిగితే తమకేమీ తెలియదనే సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. పైనుంచి వచ్చిన కోడిగుడ్లు యధాతథంగా పిల్లలకు ఇచ్చామే తప్ప తమకు ఏమీ తెలియదనే రీతిలో వారు మాట్లాడినట్లు సమాచారం.
సీపీడీవో ఎంట్రీ.. ప్లాస్టిక్ గుడ్లు కాదని నిర్ధారణ
అంగన్వాడీ కేంద్రంలో ప్లాస్టిక్ గుడ్లు ఇచ్చారనే వార్త దావానంలా వ్యాపించింది. దాంతో సమాచారం అందుకున్న తుంగతుర్తి సీపీడీవో వెంకటరమణ వెంటనే సదరు అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్నారు. పిల్లలకు పంపిణీ చేసిన కోడిగుడ్లను నిశితంగా పరిశీలించారు. అందులో కొన్నింటిని నీటిలో వేసి పరీక్షించడంతో అసలు విషయం బయటపడింది. అవి నీటిపై తేలియాడటంతో నాసిరకమని గుర్తించారు. మరికొన్ని గుడ్లను ఉడకబెట్టి చూడగా అవి కూడా పాడయిపోయాయి. దాంతో అవి కుళ్లిపోయిన కోడిగుడ్లని నిర్ధారించారు.
ఈ ఘటనపై సీరియస్ అయిన సీపీడీవో కాంట్రాక్టర్ను పిలిపించి మందలించారు. కుళ్లిన కోడిగుడ్లను సరఫరా చేస్తే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అదలావుంటే ప్లాస్టిక్ గుడ్లు ఇచ్చారనే వాదనలు కరెక్ట్ కాదని ఆయన వివరణ ఇచ్చారు. గుడ్లు చాలా పాతవి కావడంతోనే ఈ సమస్య వచ్చిందని.. అవి కుళ్లిపోయిన గుడ్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూస్తామని తెలిపారు.