తెలంగాణాలో డేంజర్ బెల్స్ ... 36కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అగ్ర దేశాలను వణికిస్తుంది . ఇక తీరని ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని మిగులుస్తున్న కరోనా ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక భారతదేశంలోనూ కరోనా కేసుల సంఖ్య 534కి చేరింది .తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరుకుంది. తాజాగా మరో ముగ్గురిలో కరోనా లక్షణాలు గుర్తించారు. వీరు కూడా విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు .
36 పాజిటివ్ కేసులతో తెలంగాణలో టెన్షన్
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం తెలంగాణా సర్కార్ ను టెన్షన్ పెడుతుంది.ఇక తాజాగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం ధ్రువీకరించింది. కొత్తగా నమోదైన మూడు కేసులో ఒకరు రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వ్యక్తి కాగా మరొకరు చందా నగర్ కు చెందిన వారు, ఇక మూడో వ్యక్తి బేగం పేటకు చెందిన వారు .
తాజాగా పాజిటివ్ కేసులన్నీ విదేశాల నుండి వచ్చిన వారే
ఇకరంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వ్యక్తికి సుమారుగా 49ఏళ్ల వయసున్నట్లుగా నిర్ధారించారు. కొద్ది రోజుల క్రితమే ఇతడు లండన్ నుంచి తెలంగాణకు వచ్చినట్లుగా గుర్తించారు. ఇక ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్లోని చందానగర్కు చెందిన మహిళకు కరోనా వైరస్ పాజిటివ్గా వచ్చినట్లుగా వైద్యాధికారులు వెల్లడించారు. ఈమె వయసు 39 ఏళ్లు కాగా, ఈమె ఇటీవల జర్మనీ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. మరో వ్యక్తి బేగంపేటకు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు. ఈమె సౌదీ అరేబియా నుంచి ఇటీవలే నగరానికి వచ్చినట్లు పేర్కొన్నారు.
వేగంగా పెరుగుతున్న కేసులతో కేసీఆర్ అత్యవసర సమావేశం
ప్రస్తుతం ఈ ముగ్గురికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుగా అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనావైరస్ పంజా విసురుతోంది. మార్చి 23న ఒక్క రోజే ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో కేసుల సంఖ్య 33కు చేరింది. తాజాగా మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మొత్తం కరోనా సంఖ్య 36కు చేరింది. ఇక రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులపై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.