భువనేశ్వరిని అవమానించడం సరికాదు.. షర్మిల, కవిత, కేటీఆర్ కూడా స్పందించాలి: కొండా సురేఖ
నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై రియాక్షన్ కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత కొండా సురేఖ స్పందించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను దేశం మొత్తం ఖండించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల మాటలు తనను కలిచి వేశాయన్నారు. ఒక మహిళగా తోటి మహిళకు జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. దీనిపై పార్టీలకతీతంగా ప్రతీ ఒక్కరు స్పందించాలని ఆమె అన్నారు.

పార్టీల వరకే.. కానీ
రాజకీయాలు పార్టీల వరకే పరిమితం అవ్వాలి, వ్యక్తిగతంగా కుటుంబాల వరకు వెళ్లొద్దని కొండా సురేఖ హితవు పలికారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి, సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా దీనిపై మాట్లాడాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. అటు ఏపీ అసెంబ్లీ ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించకపోవడం బాధేసిందన్నారు. తల్లి లాంటి మహిళకు అవమానం జరిగినా మంత్రి కేటీఆర్ కనీసం ట్వీట్టర్లో అయినా స్పందించకపోవడం బాధాకరం అన్నారు.

గౌరవం పోయింది..
లక్ష్మీపార్వతి మాటలతో ఆమె మీద గౌరవం పోయిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా శాపనార్థాలు పెట్టడం సరికాదని సూచించారు. సాటి మహిళగా మరో మహిళకు అవమానం జరగొద్దని రోజా కోరుకోవాలన్నారు. తన భార్యకు రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ ఆమెను కూడా చర్చల్లోకి లాగుతున్నారని చంద్రబాబు వాపోయారు. కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. సభలో వైసీపీ సభ్యులు కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సతీమణి గురించి నీచంగా మాట్లాడారని బాధపడ్డారు. ఆమెకు తన గురించి తప్ప మరో ఆలోచన లేదని చెప్పారు. భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదని అన్నారు.

కంట తడి
ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సంక్షోభం వచ్చినా ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. శాసనసభలో అవమానాలను భరించలేకపోతున్నానని, మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని చంద్రబాబు శపథం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన నేరుగా టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. వెక్కి..వెక్కి..ఏడ్చారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు చంద్రబాబుకి మద్దతుగా నిలిచారు. ఆయనకు సానుభూతి తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్, హెల్పింగ్ స్టార్ సోనూ సూద్.. అసెంబ్లీ ఘటనను ఖండించారు. చంద్రబాబుని ఫోన్లో పరామర్శించారు.