ఢిల్లీ ఫాలోస్ హైదరాబాద్: కేసీఆర్ బాటలోనే కేజ్రీ .. అదే క్రేజ్ అదే గేమ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీటాన్ని అధిష్టించనున్నారు. ఢిల్లీ ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ఇక మూడో సారి ఈ సామాన్యుడు ఢిల్లీ బాద్షాగా మారనున్నారు. ఢిల్లీ ఓటర్లను కేజ్రీవాల్ ఏరకంగా ఆకట్టుకున్నారు... మరోవైపు ఈ ఢిల్లీ ఎన్నికలు 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పోలిఉన్నాయి. కేసీఆర్ స్ట్రాటజీని కేజ్రీవాల్ ఫాలో అయ్యారా?
ఢిల్లీలో పాజిటివ్ ఓటింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కేజ్రీవాల్కు ఈ ఎన్నికల్లో కలిసివచ్చిన అంశాలేంటని ఒకసారి పరిశీలిస్తే ముందుగా ఢిల్లీలో జరిగింది పాజిటివ్ ఓటింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సాధారణంగా కొంతవరకు వ్యతిరేకత ఉంటుంది. కానీ కేజ్రీవాల్ మూడుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకత పెద్దగా కనిపించలేదు. మరోవైపు ఆమ్ఆద్మీ అంటే సామాన్యుడిని అని చెప్పుకునే కేజ్రీవాల్.. అదే సామాన్యులకు కావాల్సి అవసరాలను గ్రహించి వాటిని సంక్షేమ పథకాల రూపంలో అమలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యంగా పేద ప్రజలు, మధ్య తరగతి కుటుంబాలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
టీడీపీ లేకుండా చేసిన కేసీఆర్..కాంగ్రెస్ లేకుండా చేసిన కేజ్రీ
ఇక ఢిల్లీలో కేజ్రీవాల్కు కలిసొచ్చిన అంశం కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే. అంటే ఒకప్పుడు హార్డ్ కోర్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం ఆప్ వైపు మరలడం కేజ్రీవాల్కు అదనపు బలంగా మారిందని చెప్పాలి. తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ బీసీ వర్గాలను, టీడీపీని తనవైపు తిప్పుకుని పెద్ద విజయం సాధించారు. తెలంగాణలో టీడీపీకి నామరూపాలు లేకుండా చేశారు కేసీఆర్. ఇలాంటి మంత్రనే ఫాలో అయ్యారు కేజ్రీవాల్. దళిత ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేశారు. ఒకప్పుడు ఢిల్లీని ఘనంగా ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క సీటు గెలిచేందుకు సర్వం ఒడ్డాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీఎం అభ్యర్థులను ప్రకటించకుండా బీజేపీ కాంగ్రెస్ సెల్ఫ్గోల్
ఇక తెలంగాణలో సీఎం కేసీఆర్ సామాన్యులకు కావాల్సిన సంక్షేమ పథకాలు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. అందునా రైతుల కోసం రైతు బంధు పథకం తీసుకొచ్చి అది కూడా ఎలాంటి పరిమితులు లేకుండా విజయవంతంగా అమలు చేయడంతో తెలంగాణ రైతాంగం కేసీఆర్కు నాడు పట్టం కట్టింది. అంతేకాదు శాంతిభద్రతల విషయంలో కూడా కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్ను ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో నాడు ఎలాగైతే బీజేపీకి కాంగ్రెస్లకు సీఎం అభ్యర్థి లేరో... ఢిల్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ కాంగ్రెస్లు తమ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా సెల్ఫ్ గోల్ వేసుకున్నాయి. అంతేకాదు బీజేపీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించాలంటూ బహిరంగ సవాల్ విసిరారు కేజ్రీవాల్.
Recommended Video
షీలా దీక్షిత్ మృతితో ఢిల్లీ కాంగ్రెస్కు లేని నాయకత్వం
ఇక బీజేపీకి గోలీమార్ స్లోగన్ పెద్ద నష్టం చేకూర్చిందనే చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీ కంటే క్వాలిటీ ఉన్న పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు విశ్వసించినట్లు ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. ఇక కేసీఆర్ ఎలాగైతే టీడీపీ ఓటింగ్ను డైవర్ట్ చేసుకున్నారో.. కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ ఓటింగ్ను డైవర్ట్ చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ మరణం తర్వాత ఢిల్లీ కాంగ్రెస్కు నాయకత్వం కొరవడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి పట్టం కట్టిన ప్రజలు పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి పూర్తి సీట్లను టీఆర్ఎస్కు ఇవ్వలేదు. నాలుగు సీట్లు బీజేపీకి, రెండు సీట్లు కాంగ్రెస్కు వచ్చాయి. ఢిల్లీలో కూడా మొత్తం ఏడు లోక్సభ స్థానాలను గెల్చుకున్న బీజేపీ... ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేజ్రీవాల్కు దాసోహం అయ్యింది.
మొత్తానికి ఢిల్లీ ఎన్నికలు ఒక్కింత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పోలి ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే కేజ్రీవాల్, కేసీఆర్లు జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.