కూల్చాలా.. వద్దా... ఉస్మానియా ఆస్పత్రిపై వాడి వేడి వాదనలు... హైకోర్టులో విచారణ...
ఉస్మానియా ఆస్పత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన సంగతి తెలిసిందే. సోమవారం(అగస్టు 17) హైకోర్టు దీనిపై విచారణ జరిపింది. ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. కొన్ని వ్యాజ్యాలు ఆస్పత్రి భవనాన్ని కూల్చివేయాలని,మరికొన్ని వ్యాజ్యాలు కూల్చివేయొద్దని కోరుతున్నాయని... వీటన్నింటిని కలిపి విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.
Recommended Video
అడ్వకేట్ జనరల్ ఏమన్నారు....
విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ.... ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థలో ఉందని... రోగులు, డాక్టర్లు, సిబ్బంది ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్... ఉస్మానియా ఆస్పత్రిలోకి వర్షపు నీరు చేరిన వార్తలు,కథనాలను మీడియా ద్వారా చూశామన్నారు. ఇక ఇదే కేసుకు సంబంధించి ఓ పిటిషనర్ తరుపున రచనా రెడ్డి అనే న్యాయవాది ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. పురావస్తు భవనాన్ని కూల్చకుండా 26 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మించవచ్చని తన పిటిషన్లో పేర్కొన్నారు.
రచనా రెడ్డి ఇంప్లీడ్పై అభ్యంతరం...
రచనా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ను మరో కౌన్సిల్ సందీప్ రెడ్డి వ్యతిరేకించారు. ఎవరు పడితే వారు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టు సమయం వృధా చేస్తున్నారని బెంచ్కి తెలిపారు. దీనికి బదులిచ్చిన రచనా రెడ్డి.... పిటిషనర్ దేబారా 15 ఏళ్ల నుంచి అనేక ప్రజా పోరాటాల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. ఇప్పటివరకూ ఎన్నో వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలు చేశారని.... ఇప్పటికీ రెండు ఇతర వ్యాజ్యాలు విచారణ దశలో ఉన్నాయని బెంచ్కు వెల్లడించారు.
వర్షాలకు వార్డుల్లోకి నీళ్లు...
ఇటీవలి వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రిలో భారీ వరద నీరు వచ్చి చేరిన సంగతి తెలిసిందే. వార్డులు జలమయమవడంతో వైద్యులు,పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రభుత్వం ఉస్మానియా హెరిటేజ్ భవనాన్ని కూల్చివేయాలని... ఆస్పత్రి ఉన్నచోటే ఏడాది లోపు 24 అంతస్తుల చొప్పున ట్విన్ టవర్స్ నిర్మించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. నిజాం కాలం నాటి ఈ పురావస్తు భవనాన్ని కూల్చివేయవద్దని డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతే అదే నిర్మాణానికి మరమ్మత్తులు చేయాలి తప్పితే కూల్చకూడదని కోరుతున్నాయి. ఉస్మానియాలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది మాత్రం కొత్త భవన నిర్మాణానికే మద్దతు తెలుపుతున్నారు.
విపక్షాల ఆందోళనతో గతంలో వెనక్కి...
నిజానికి 5 ఏళ్ల క్రితమే ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూల్చివేసి... దాని స్థానంలో ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు కావాల్సిన అనుమతులు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో 2015 జులైలో స్వయంగా ఆయనే ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి పరిస్థితిని చూసిన అనంతరం... తక్షణం భవనాన్ని కూల్చివేసి యుద్దప్రాతిపదికన కొత్త భవన పనులు చేపట్టాలని ఆదేశించారు. కానీ ఇంతలోనే విపక్షాలు ఆందోళకు దిగడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు మరోసారి విపక్షాలు దీనికి అడ్డుపడుతుండటం,పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలవడంతో తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.