రూ.7 కోట్లతో నగలు.. చెక్ కాక నగదు చెల్లింపులు.. దేవికారాణి భర్త స్టేట్మెంట్ ఈడీ రికార్డ్..
ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇందులో రూ.కోట్లలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అవినీతి నిరోధక శాఖ కూడా విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఏసీబీతోపాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది.
దర్యాప్తులో భాగంగా దేవికారాణి భర్త గురుమూర్తి స్టేట్మెంట్ను గురువారం ఈడీ రికార్డు చేసింది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో రూ.7 కోట్లకు పైగా విలువ చేసే బంగారాన్ని దేవికారాణి కొనుగోలు చేసినట్టు తెలిసింది. నగల షాపు యజమానుల వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసింది. బంధువుల డబ్బుతో బంగారం కొనుగోలు చేశామని గురుమూర్తి స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
అక్రమంగా సంపాదించిన నగదుతో దేవికారాణి, మాజీ జేడీ పద్మ భారీగా ఆస్తులు కొనుగోలు చేశారని ఏసీబీ దర్యాప్తులో ఇదివరకే వెల్లడించింది. అయితే ప్రధాన నిందితులు అందరూ ఎక్కువగా భూములే కొనుగోలు చేశారు. దేవికారాణి మాత్రం భూములతోపాటు నగలు కూడా కొనుగోలు చేశారు. ముడుపులుగా అందిన నగదును నగరంలోని ప్రముఖ నగల షాపులో ఆభరణాలు కొనేందుకు మళ్లించారని గుర్తించారు. రూ.7 కోట్ల నగదు లావాదేవీలు నగదు రూపంలోనే నగల షాపు యాజమాన్యాలు తీసుకున్నారు.
Recommended Video
అయితే కోట్ల నగదు తీసుకోవడం.. అభ్యంతరం తెలుపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఎక్కువ మొత్తంలో చెల్లింపులకు సంబంధించి చెక్కు/ లేదా ఆన్ లైన్ ద్వారా కొనుగోలు జరపాలి. మరీ దేవికారాణి విషయంలో వారు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారనే అంశంపై కూడా విచారణ చేసే అవకాశం ఉంది.