కార్తీక పౌర్ణమి శోభ.. ఆలయాల్లో భక్తుల రద్దీ.. దీపారాధనతో ప్రత్యేక పూజలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అటు వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ వీపరీతంగా ఉంది. పుష్కరిణిలో స్నానం ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
భద్రాచలంలో కార్తీక పౌర్ణమి సందడి పెరిగింది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సుబ్రమణ్యేశ్వర ఆలయంలో మొక్కులు తీర్చుకుంటున్నారు. అనంతరం రాములోరిని దర్శించుకుంటున్నారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సమీపంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. అనంతరం గోదావరిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. మొత్తానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు కొత్త శోభ సంతరించుకున్నాయి. ఆలయాల్లో దీపాలు వెలిగిస్తూ భక్తులు దైవరాధన చేస్తున్నారు.