రాములోరినీ వదలని కరోనా: భక్తులు లేకుండా శ్రీరామనవమి ఉత్సవాలు: ఎవరూ రావొద్దంటూ..
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావం పండుగలపైనా పడింది. ఏటేటా అంగరంగ వైభవంగా కొనసాగే శ్రీరామనవమి ఉత్సవాలు ఈ సారి బోసి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా భక్తులు ఎవరూ శ్రీరామనవమి నాడు సీతారామ కల్యాణాన్ని వీక్షించడానికి భద్రాద్రికి రావొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యగా భక్తుల రాకపై ఆంక్షలు విధించినట్లు పేర్కొంది.
వచ్చేనెల 2వ తేదీన శ్రీరామనవమి పండుగ. తెలంగాణలో భద్రాద్రిలో, ఏపీలో కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కన్నుల పండువగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ సారి రామనవమి ఉత్సవాలు ఆనవాయితీకి భిన్నంగా జరుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
భక్తుల రాకపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. భద్రాద్రిలో నిర్వహించే వేడుకలకు హాజరయ్యే భక్తులపై ఆంక్షలు విధించినట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. పరిమితంగా మాత్రమే భక్తులకు అనుమతించనున్నట్లు తెలిపారు. సీతారాముల కల్యాణంలో పాల్గొనడానికి ఆన్లైన్ ద్వారా టికెట్ల విక్రయాన్ని నిలిపివేశామని, ఇప్పటిదాకా జారీ చేసిన టికెట్లను కూడా రద్దు చేస్తామని తెలిపారు.
ఇదివరకట్లాగా చలువ పందిళ్లను వేసి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించట్లేదని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రాంగణంలో సాదాసీదాగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. స్వామివారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమం యధాతథంగా ఉంటుందని, పరిమితంగా మాత్రమే ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులకు అనుమతి ఇస్తామని అన్నారు.