దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం, అవసరం లేదన్న ఏజీ, చేయాల్సిందేనంటోన్న హైకోర్టు
దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. మృతదేహాలను బంధువులకు అప్పగించాలనే పిటిషన్పై శుక్రవారం వాడీవేడీగా వాదనలు జరిగాయి. తెలంగాణ అడ్వకేట్ జనరల్, హైకోర్టు ధర్మాసనం మధ్య రీ పోస్టుమార్టం అంశం హాట్ డిస్కషన్ చర్చ జరిగింది. నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఉన్న సంగతి తెలిసిందే. శనివారం గాంధీ సూపరింటెండెంట్ మృతదేహాల పరిస్థితి, రీపోస్టుమార్టం గురించి చెప్పే అంశాల ఆధారంగా హైకోర్టు ఆదేశాలను వెలువరించనుంది.
దిశ లాంటి ఘటనలపై మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు, సమాజంలో మార్పు రావాలట...
6న ఎన్కౌంటర్
వెటర్నరీ వైద్యురాలు దిశపై మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు అనే నలుగురు మృగాళ్లు లైంగికదాడి చేసి, హతమార్చిన సంగతి తెలిసిందే. వారిని పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ఈ నెల 6వ తేదీన చటాన్పల్లికి తీసుకెళ్లగా.. పోలీసులపైనే దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ రోజే ఘటనాస్థలంలో పంచనామా పూర్తిచేసిన తర్వాత మహబూబ్ నగర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
అంత్యక్రియలకు బ్రేక్
అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులే ఏర్పాట్లు చేయగా.. హైకోర్టులో మహిళా సంఘాలు పిటిషన్ వేయడం, జాతీయ మానవ హక్కుల కమిషన్ పర్యటన నేపథ్యంలో మృతదేహాలు పాలమూరు ఆస్పత్రిలోనే ఉంచారు. సుప్రీంకోర్టు కూడా కమిటీ వేయడంతో.. పాలమూరు ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 17వ తేదీన మృతదేహాలకు సంబంధించి ఆధారాలు సేకరించి, బంధువులకు అప్పగించే అంశంపై నిర్ణయాన్ని హైకోర్టుకు సుప్రీంకోర్టు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి.
రీ పోస్టుమార్టం
నాలుగు మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయాలని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మహబూబ్నగర్ ఆస్పత్రిలో నిపుణులు పోస్టుమార్టం చేశారని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రీ పోస్టుమార్టం అవసరం లేదని వాదనలు వినిపించారు. కానీ ఏజీ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. అటాప్సీ చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. శనివారం గాంధీ సూపరింటెండెంట్ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే 15 రోజులు అవుతున్నందున.. శనివారం గాంధీ సూపరింటెండెంట్ చెప్పే అంశాల ఆధారంగా హైకోర్టు తదుపరి ఆదేశాలు ఉంటాయి.
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు..
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సెంట్రల్ ఫోరెన్సిక్ విభాగం పోస్టుమార్టం చేయాల్సి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక్కడ చేసిన వారు కూడా రాష్ట్ర ఫోరెన్సిక్ నిపుణులు అని ఏజీ చెప్పినా.. హైకోర్టు విభేదించింది. ఎన్కౌంటర్ అంశం దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైందని.. అన్నీ అంశాలు ఫెయిర్గా ఉండాలని పేర్కొన్నది. ఆ మేరకు రీ పోస్టుమార్టం చేసేందుకు హైకోర్టు ధర్మాసనం ఆలోచిస్తోంది. శనివారం గాంధీ సూపరింటెండెంట్ చెప్పే అంశాల ఆధారంగా అటాప్సీ ఉంటుంది.