Disha case encounter :ఆ పోలీసులపై హత్యానేరం కేసులు పెట్టి అరెస్ట్ చెయ్యాలన్న ఏపీ మానవ హక్కుల ఫోరం
షాద్ నగర్ లో దారుణ హత్యకు గురైన దిశ కేసు కొత్త మలుపు తిరిగింది. ఊహించని విధంగా దిశను సామూహిక అత్యాచారం చేసి హత్యచేసిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సంఘటన స్థలంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితులను తీసుకువెళ్లిన పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ నలుగురు మానవ మృగాలు. దీంతో వారిని పోలీసులు దిశను దహనం చేసిన చోటే ఎన్కౌంటర్ చేశారు. ఇక దీని పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది.
Disha case encounter : ఎన్ కౌంటర్ లకు తాను వ్యతిరేకం అంటున్న అసదుద్దీన్ ఓవైసీ
జాతీయ మానవ హక్కుల కమిషన్ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తాము వచ్చి పరిశీలించే వరకు మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించింది . ఇక ఈ నేపథ్యంలో మానవ హక్కుల సంఘాల నుండి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పని, నేరస్థులని నిర్ధారణ కాకముందే నిందితులను పోలీసులు హతమార్చారని పలువురు మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే సమయంలో ఏపి మానవ హక్కుల ఫోరం'దిశ' కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీస్ సిబ్బందిపై హత్యానేరం కింద కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
Recommended Video
చనిపోయింది రిమాండ్ ఖైదీలే కాబట్టి న్యాయస్థానం ఈ కేసును సుమోటోగా తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు కావాలని నిందితులను ఓ పథకం ప్రకారం ఎన్కౌంటర్ చేశారని ఆరోపణలు గుప్పించింది. నిందితులు నేరం చేశారని నిర్ధారించి శిక్షలు వేయాల్సింది న్యాయస్థానమని, పోలీసులు కాదని మానవ హక్కుల ఫోరం వ్యాఖ్యానించింది. చట్టాన్ని పోలీసుల చేతుల్లోకి తీసుకోవడం తప్పని ఏపీ మానవహక్కుల ఫోరం ఆక్షేపించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా న్యాయస్థానాలు చూడాల్సిన అవసరం ఉందని ఏపీ మానవ హక్కుల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది.