దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ, రేపటికి వాయిదా
చటాన్పల్లి ఎన్కౌంటర్ పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీ చేత విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. తర్వాత పిటిషన్ విచారణను గురువారానికి వాయిదా వేసింది. పీఎస్ మణి, ప్రసాద్ అనే అడ్వకేట్లు ఎన్కౌంటర్ అనుమానం లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
కలుగజేసుకొదు..కానీ
సాధారణంగా కింది కోర్టులు విచారణ చేపట్టే సమయంలో సుప్రీంకోర్టు కలుగజేసుకోదు. కానీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని భావించి.. రిటైర్డ్ జడ్జీ చేత విచారణకు ఆదేశించింది. దీనిని బట్టి ఎన్కౌంటర్ను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందని అర్థం చేసుకోవచ్చు. ఎన్కౌంటర్కు సంబంధించి పూర్తి సమాచారం తమ వద్ద ఉందని సర్వోన్నత ధర్మాసనం పేర్కొన్నది. 11 మంది పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తే జాగ్రత్తలు తీసుకోలేదా అని భావించి ఈ మేరకు రిటైర్డ్ జడ్జీ చేత విచారణకు నిర్ణయం తీసుకుంది.
ప్రతివాదులు వీరే
ఎన్కౌంటర్ సందేహాలు వ్యక్తం చేసిన అడ్వకేట్లు.. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, సైబరాబాద్ సీపీ సజ్జనార్ని ప్రతివాదులుగా చేర్చారు. కేసుకు సంబంధించి గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
ఆరు రోజులు..
గత శుక్రవారం చటాన్పల్లి వద్ద దిశ హత్య కేసు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులను ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు పోస్టుమార్టం పూర్తిచేసి అంత్యక్రియలకు పోలీసులు ఏర్పాట్లు చేస్తుండగా.. జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీచేసింది. గత ఐదురోజులుగా రాష్ట్రంలో విచారిస్తోంది. మరోవైపు హైకోర్టు కూడా నోటీసులు ఇవ్వడంతో నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
పేరెంట్స్ ఆందోళన
బుధవారం విచారణ చేపట్టి గురువారానికి వాయిదా వేయడంతో.. కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుందనే ఆందోళన ఉంది. ఎన్కౌంటర్ జరిగి శుక్రవారానికి వారం రోజులు గడుస్తోన్నా.. అంత్యక్రియలు మాత్రం జరగడం లేదు. దీంతో కుటుంబసభ్యులు కూడా విలపిస్తున్నారు.