రాంగోపాల్ వర్మకు హైకోర్టు షోకాజ్ నోటీసులు... 'దిశ' సినిమాపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు...
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజు నోటీసులు జారీ చేసింది. దిశ ఎన్కౌంటర్ చిత్రంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలు గతంలోనే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం దర్శకుడి నుంచి వివరణ కోరింది.
ఎన్కౌంటర్ మృతుల కుటుంబాల తరుపున న్యాయవాది కృష్ణమూర్తి హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే వారి కుటుంబాలు తీవ్ర మనో వేదనకు గురవుతున్నాయని చెప్పారు. ఇలాంటి తరుణంలో వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం.. వారిని ఊరిలో కూడా ఉండనివ్వకుండా చేసే పరిస్థితిని తీసుకొచ్చేలా ఉందన్నారు. ఈ చిత్రం ద్వారా వారిని దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ జ్యుడీషియల్ కమిషన్ విచారణ సాగుతున్న కేసుపై సినిమా ఎలా తీస్తారని ప్రశ్నించారు. దిశ ఎన్ కౌంటర్ చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు.
ఈ నెల 26న దిశ సినిమా విడుదలకు వర్మ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో.. హైకోర్టు నోటీసులు ఇవ్వడం గమనార్హం. నోటీసులపై ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను ఆపాలంటూ గతంలో దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతంపై వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ సినిమాపై కూడా కోర్టు కేసులు నడుస్తున్నాయి.
కాగా,గతేడాది నవంబర్ 27న షాద్ నగర్ సమీపంలోని చటాన్పల్లి వద్ద దిశ హత్యాచారానికి గురైంది. కేసు విచారణలో భాగంగా డిసెంబర్ 6,2019 తెల్లవారుజామున పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. ఇందుకోసం నిందితులను చటాన్పల్లి తీసుకెళ్లారు.అయితే నిందితులు పోలీసుల వద్దనున్న తుపాకులు లాక్కుని కాల్పులకు యత్నించడంతో... ఆత్మరక్షణలో భాగంగా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అన్న విమర్శలు కూడా వచ్చాయి.