దిశ హత్య: హైదరాబాద్ మెట్రోలో మహిళలకు ‘పెప్పర్ స్ప్రే’ అనుమతి
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. నిందితులకు వెంటనే ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో మహిళలకు రక్షణ ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో మహిళల భద్రతకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలులో ప్రయాణం సందర్భంగా మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లేందుకు అనుమతించింది. ఇప్పటికే బెంగళూరు మెట్రోలో మహిళలు పెప్పర్ స్ప్రే తమ వెంట తెచ్చుకునేందుకు అనుమతించింది.
బెంగళూరు తర్వాత హైదరాబాద్ మెట్రో కూడా అదే నిర్ణయం తీసుకుంది. మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ మెట్రో వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా మెట్రో రైలులో సాంకేతిక కారణాలతో పెప్పర్ స్ప్రే, మంటలు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు.
పెప్పర్ స్ప్రే వల్ల తరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎవరైనా వీటిని తీసుకొస్తే తనిఖీ కేంద్రాల వద్దే అడ్డుకుంటారు. కానీ, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇక్కడి మెట్రో అధికారులు మహిళలకు పెప్పర్ స్ప్రే తమ వెంటే తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు.
శంషాబాద్లో జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటనపై నలుమూలల నుంచి ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. పోలీసులు కూడా తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు, ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.