దిశ హత్యకేసు .. తల్లిదండ్రులు మారండి .. మగపిల్లలపై దృష్టి పెట్టండి : హరీష్ రావు
దిశ అత్యాచారం, హత్య నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు.తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు రక్షణ లేదని కొందరంటే, మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని మరికొందరు చెబుతున్నారు. ఇలాంటి నేరస్తులు ఉరి తీసి చంపాలని కొందరంటే, అరబ్ దేశాలలాగా నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా నరికి చంపాలని మరికొందరు చెబుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ ఘటనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
దిశ అత్యాచారం,హత్యకేసు ... నిందితులకు 10 రోజుల పోలీసు కస్టడీ విధించిన కోర్టు
సిద్ధిపేటలోని ప్రభుత్వం బాలికల పాఠశాలలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార సేవా కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ అమ్మాయిలపై అఘాయిత్యాలు బాధాకరమని పేర్కొన్నారు. దిశపై అఘాయిత్యం ఘటన తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందని హరీశ్ రావు అన్నారు. ఇక పాఠశాల స్థాయి నుండే అమ్మాయిలు తమను తాము రక్షించుకునే విధంగా నెలలో ఒకసారి శిక్షణ ఇవ్వాలని అన్నారు.
అంతేకాకుండా ముఖ్యంగా తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలని , పిల్లలు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని హరీష్ రావు పేర్కొన్నారు. మగపిల్లలకు విద్యతో పాటు విలువ, సంస్కారంతో కూడిన నడవడికను నేర్పించాలని అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడపిల్లలపై కన్నా ఎక్కువగా మగపిల్లలపై దృష్టి పెట్టాలని, వాళ్ళని సక్రమంగా పెంచాలని హరీష్ రావు పేర్కొన్నారు. వాళ్లు ఏం చేస్తున్నారన్న విషయాలను గమనిస్తూ వుండాలని తల్లిదండ్రులకు సూచించారు మంత్రి హరీష్ రావు.